నిండు సభలో కంటతడి పెట్టిన మంత్రి విడదల రజిని..!!
అమరావతి: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవ్వాళ ముగియనున్నాయి. చివరిరోజున కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చివేసింది. డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా నామకరణం చేసింది. దీనికి సంబంధించిన బిల్లును సభ ఆమోదించింది. పేరును మార్చడానికి గల కారణాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చడాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారు. పోడియం వైపు దూసుకెళ్లారు. స్పీకర్ స్థానాన్ని ముట్టడించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ టీడీపీ సభ్యులు నినదించారు. బిల్లు ప్రతులను చింపి గాల్లోకి ఎగురవేశారు. ఈ చర్యకు పాల్పడిన 13 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీనితో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ అంటే తెలుగువారందరూ భావోద్వేగాలకు గురవుతారని చెప్పారు. వైఎస్సార్ పేరుతో తెలుగు ప్రజలకు ఓ అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు. వైఎస్సార్ మరణవార్త విని తట్టుకోలేక వందలాది మంది చనిపోయారని.. ఆయనతో ప్రజలకు ఉన్న బంధానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ను ఓ గొప్ప మానవతావాదిగా, సమర్థుడైన ప్రజా రక్షకుడిగా అభివర్ణించారు విడదల రజిని. ప్రజల్లో నుంచి వచ్చిన పరిపాలన దక్షుడిగా పేర్కొన్నారు. చివరి క్షణం వరకు ప్రజల్లో, ప్రజల కోసమే శ్వాసించారని చెప్పారు. వైఎస్సార్-ప్రజలు అనే పదాలు వేర్వేరు కావని, రెండూ ఒకటేనని అన్నారు. వైఎస్ మరణానంతరం ఉమ్మడి ఏపీలో ఏర్పడిన పరిస్థితుల గురించి విడదల రజిని ప్రస్తావించారు. వైఎస్సార్ హఠాన్మరణంతో 2009లో గాడి తప్పిన రాష్ట్రం మళ్లీ పట్టాలెక్కడానికి 13 సంవత్సరాలు పట్టిందని అన్నారు.
ఉక్రెయిన్పై యుద్ధం ఏడు నెలలకు చేరిన వేళ.. పుతిన్ సంచలనం ప్రకటన: మోదీని కాదని
ఏపీ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోందని, ఆర్థికంగా పరిపుష్టి సాధించేదిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. వైఎస్సార్ పరిపాలన దక్షతను, గొప్పతనాన్ని భావి తరాలకు తెలియజేయడానికే హెల్త్ యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సముచిత నిర్ణయమని వ్యాఖ్యానించారు. తాను దీన్ని స్వాగతిస్తున్నానని విడదల రజిని చెప్పారు.