చంద్రబాబుని గెలిపించడానికి పవన్ కళ్యాణ్ తాపత్రయం: మండిపడ్డ మంత్రి విడదల రజిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన పొత్తులతో ముందుకు వెళతారని, ఈ మేరకే ఇరువురు నేతలు భేటీ అయ్యారని ఏపీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక ఇరువురు నేతలు భేటీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతుంది. ఎంత మంది కలిసి పోటీ చేసినా జగన్ సింహం... సింగిల్ గానే పోటీ చేస్తారని మంత్రి రోజా వంటి పలువురు నేతలు ఇప్పటికే తేల్చి చెప్పారు.
ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రి విడదల రజిని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బేటి పై మండిపడిన మంత్రి విడదల రజిని తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటేనని మనుషులు మాత్రమే వేరని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కందుకూరు, గుంటూరులో టిడిపి కార్యక్రమాలలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించకుండా చంద్రబాబు నాయుడును పరామర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి విడదల రజిని అభిప్రాయం వ్యక్తం చేశారు.

చంద్రబాబుని గెలిపించడానికి పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నాడు అని మంత్రి విడదల రజిని ఆరోపించారు. అన్ని పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్ వెంట ప్రజలు ఉన్నారని తేల్చి చెప్పారు విడదల రజనీ. ఏపీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం జీవో నెంబర్ 1 ను తీసుకు వచ్చినట్లుగా విడదల రజిని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యం పాలైందని విడదల రజిని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకరినొకరు పరామర్శలు చేసుకుంటూ ఉండటం విడ్డూరంగా ఉందని విడదల రజిని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications