విడదల రజిని మంత్రి కావటంతో తెలంగాణాలోని ఆ గ్రామంలో సంబరాలు; రజిని పాపులారిటీకి కారణమిదే!!
చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడుదల రజిని చిన్న వయసులోనే మంత్రి పదవిని అధిరోహించి చరిత్ర సృష్టించారు. 32 ఏళ్ళకే మంత్రి పదవిని దక్కించుకుని పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ గా మారారు. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ ప్రాధాన్యతను సంపాదించుకున్న అతికొద్ది రాజకీయ నాయకులలో విడదల రజిని ఒకరు. తక్కువ సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని పొంది క్యాబినెట్ మంత్రిగా ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు విడదల రజిని.
విడదల రజినికి తెలంగాణాలోనూ పాపులారిటీ
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన విడదల రజిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టిని ఆకర్షించారు. టిడిపిలో ఉన్న సమయంలో వైయస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించినప్పటికీ ఇప్పుడు జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకుని విడదల రజిని తన ప్రత్యేకతను చాటుకున్నారు. పిన్న వయసులో విడదల రజిని మంత్రి కావడంతో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లోనే కాకుండా తెలంగాణలోనూ విడుదల రజినికి మంచి ఫాలోయింగ్ ఉంది.
తెలంగాణా ఆడబిడ్డ విడదల రజిని .. అందుకే ఆమె సొంతూరులో సంబరాలు
మంచి పాపులారిటీ ఉన్న విడదల రజిని మంత్రి కావడంతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామం లో సంబరాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విడదల రజిని మంత్రి కావడంతో సంబరాలు జరగడానికి గల కారణం విడదల రజిని తెలంగాణ ఆడబిడ్డ. తెలంగాణ రాజధాని కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం విడదల రజిని స్వగ్రామం. కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రాగుల సత్తయ్య రెండో కుమార్తె విడదల రజిని.
రజిని చదివింది, ఉద్యోగం చేసింది అంతా తెలంగాణాలోనే
ప్రస్తుతం ఆమె మంత్రి కావడంతో కొండాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. రజిని కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకుంటున్నారు కొండాపురం గ్రామస్తులు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రజిని కుటుంబం బతుకుతెరువు కోసం కొండాపురం నుంచి హైదరాబాద్ వెళ్ళి స్థిరపడ్డారు. సికింద్రాబాద్ పరిధిలోని సఫిల్ గూడ లో వారు నివాసం ఉంటున్నారు. ఇక రజిని విద్యాభ్యాసం అంతా తెలంగాణ రాష్ట్రం లోనే సాగింది. విడదల రజిని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ మల్కాజిగిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ కంప్యూటర్స్ లో డిగ్రీ పూర్తిచేసి, ఆపై ఎంబీఏ చేశారు.
పెళ్లి తర్వాత అమెరికా వెళ్లి ఆర్ధికంగా స్థిరపడిన రజిని.. ఆపై రాజకీయాల్లో
హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పని చేశారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆమెకు విడదల కుమారస్వామితో వివాహం జరిగింది. ఆపై అమెరికా కి వెళ్ళిన రజిని అక్కడ ఒక ఐటీ కంపెనీ పెట్టి ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. ఆపై 2014లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత టిడిపి ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఇక 2019 ఎన్నికలలో తనకు టికెట్ రాదని తెలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు విడదల రజిని . చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఎమ్మెల్యే అయిన తర్వాత వివాదాలు.. అయినా సరే మంత్రిగా స్థానం
తన గురువు టిడిపి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పై ఎనిమిది వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విడదల రజిని గెలుపొందారు.విడదల రజిని ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమెపై అనేక వివాదాలు చోటు చేసుకున్నప్పటికీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆమెకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మొత్తానికి విడదల రజిని మంత్రి కావడం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అభిమానుల సంబరాలకు కారణమవుతుంది. తెలంగాణ ఆడబిడ్డ ఆంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పడాన్ని తెలంగాణ అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.