బాబు ఝలక్!: మంత్రులకి స్టార్ హోటళ్లలో బస నిషేధం, 'జగన్కు కేసులకే జీవితం'
విజయవాడ: మంత్రులు స్టార్ హోటళ్ల నుంచి బయటకు రావాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం అన్నారు. స్టార్ హోటళ్లలో మంత్రుల బస పైన నిషేధం విధిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
ప్రభుత్వ అతిథి గృహాల్లో మంత్రులు నివాసం ఉండాలని సూచించారు. ప్రభుత్వ అతిథి గృహాలకు మరమ్మతు చేయాలని రోడ్స్ అండ్ బిల్డింగ్ అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల నివాసాల కోసం అద్దె రేట్లను సవరించారు.
రెండు నెలల్లో ఉద్యోగులు విజయవాడకు తరలి రావాలన్నారు. వారికి నివాస, కార్యాలయ, వసతుల ఏర్పాట్లను జవహర్ కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. హడ్కో ద్వారా రాజధాని ప్రాంతంలో ఉద్యోగులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. త్వరలో పదివేల ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు.
మంత్రులు ఇక నుంచి అతిథి గృహాల్లోనే సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అతిథి గృహాలను మరమ్మతు చేసి వారికి ఇస్తామని చెప్పారు. టూరిజం థరమ్ పార్కు, సబ్ కలెక్టర్ సమావేశ మందిరాలను సమీక్షలకు వినియోగించుకోవాలన్నారు.
చంద్రబాబుదే ఘనత: సోమిరెడ్డి
గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో అన్నారు. పట్టిసీమను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
సిబిఐ, ఈడీ కేసులను ఎదుర్కొనేందుకు జగన్కు జీవిత కాలం పడుతందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం గురించి నిందితులే ఎక్కువగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విభజన హామీల పైన చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడటం లేదని చెప్పారు.