విజయవాడకు వంగవీటి పేరు పెట్టాలనే డిమాండ్ వస్తే... : పేర్ని నాని ఏమన్నారంటే?, కొడాలి నాని ఇలా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త జిల్లాలపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మెజార్టీ ప్రజల అభిప్రాయానికి ఓటేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా, మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాలు, పునర్ వ్యవస్థీకరణపై అభ్యంతరాలుంటే చెప్పాలన్నారు.
ఆ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ వస్తే..: పేర్ని నాని
గతంలో ప్రజలకు అందుబాటులో లేకుండా జిల్లా కేంద్రాలు ఉండేవని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ వస్తే చెప్పాలని కోరారు. మెజార్టీ ప్రజల ఆమోదాన్నే పరిగణలోకి తీసుకుంటామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ పేరు పెట్టాలని కృష్ణా ప్రజల కోరిక: కొడాలి నాని
ఎన్టీఆర్ పేరు పెట్టాలని కృష్ణా ప్రజలు పాదయాత్రలో కోరారని మరో మంత్రి కొడాలని నాని తెలిపారు. అందుకే ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియ మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. తమ వద్దకు వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పరీశీలిస్తోందని అన్నారు. మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కొడాలి నాని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీకి బీజేపీని అనుబంధంగా మార్చారని ఆరోపించారు. గోవాలో క్యాసినోల సంస్కృతిని ఆపొచ్చు కదా అని ప్రశ్నించారు.
పీఆర్సీ అంశంపై ఉద్యోగుల కోసం మెట్టు దిగుతాం: పేర్ని నాని, సజ్జల
మరోవైపు పీఆర్సీ కోసం ఉద్యమం చేస్తున్న ఉద్యోగుల అంశంపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఉద్యోగ సంఘాల నేతలను చర్చకు రావాలని పదే పదే కోరుతున్నామని తెలిపారు. ప్రభుత్వంతో చర్చిస్తేనే సమస్యలకు పరిస్కారం లభిస్తుందన్నారు. ఆర్థికశాఖది తప్పని నిరూపిస్తే సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి పేర్కొన్నారు. పీఆర్సీ అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. పీఆర్సీపై ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందుకు ఓ మెట్టు దిగేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చలకు ఏర్పాటైన మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల కోసం సచివాలయంలోనే ఉందని చెప్పారు. శుక్రవారం కూడా సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటామన్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలతోపాటు ఏ ఉద్యోగ సంఘాలు వచ్చినా తాము చర్చిస్తామని, వారి డిమాండ్లను సీఎంతో చర్చించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు.