మార్చితేనే వస్తాం: తాత్కాలికం సచివాలయంపై మంత్రుల అసంతృప్తి
విజయవాడ: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పైన ఏపీ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. వారి అసంతృప్తి నేపథ్యంలో 2, 5 బ్లాకులలోని చాంబర్ల గోడలు, అద్దాలను తొలగించారు. చాంబర్లు ఇరుకుగా ఉన్నాయని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుకూలంగా మార్చిన తర్వాతనే తాము కార్యాలయాలు ప్రారంభిస్తామని మంత్రులు కుండబద్దలు కొడుతున్నారు. చాంబర్లు సరిపోవడం లేదని, ఇరుకుగా ఉన్నాయని మంత్రులు చాలా రోజుల నుంచి చెబుతోన్న విషయం తెలిసిందే.
తుది మెరుగుల్లో సచివాలయం
నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయంలో మంత్రులు, అధికారులు, సిబ్బంది చాంబర్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మంత్రులు ప్రారంభించిన ఐదు, రెండు బ్లాకుల్లో సౌకర్యాలు కల్పించారు. మంత్రుల అసంతృప్తి నేపథ్యంలో మార్పులు చేస్తున్నారు.
ఒకటి, మూడు, నాలుగు బ్లాకులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రతి భవనంలోనూ ఒకే విధమైన వసతులు కల్పిస్తున్నారు. విలువైన ఫర్నిచర్ను వినియోగిస్తున్నారు. మెరిసే టైల్స్, పాల వెలుగుల విద్యుత బల్బులతో హాళ్లు తళతళ మెరుస్తున్నాయి.
ప్రతి ఫ్లోరుకి సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఫైట్స్ పైపులను ఏర్పాటు చేశారు. ఉద్యోగుల క్యాబిన్లు, మంత్రుల పేషీలు, సందర్శకులు వేచి ఉండే గదులకు ఫర్నిచర్ను సిద్ధం చేశారు. అన్ని బ్లాకులకు ముందు తారు రోడ్లు వేస్తున్నారు. డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి.
సచివాలయానికి సంబంధించి దాదాపు 45 శాఖలకు ఐదు భవనాలు నిర్మించారు. సీఎం, చీఫ్ సెక్రటరి కార్యాలయాలుండే మొదటి బ్లాకులో పనులు దాదాపు పూర్తయ్యాయి. తాగునీటి వసతి కల్పించాల్సి ఉంది. ఉద్యోగుల క్యాబిన్లు, ఉన్నతాధికారుల చాంబర్లలో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, ఇంటర్నెట్ కనెక్షన ఇవ్వాల్సి ఉంది.