విజయ్ దారుణమైన పోస్టులు పెట్టారు: మంత్రి మేరుగ నాగార్జున..!!
టీడీపీ నేత చింతకాయల విజయ్ కు ఏపీ సీఐడీ నోటీసుల వ్యవహారం.. విమర్శల పైన మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. సీఐడీ దొంగని పట్టుకోవటానికి వెళ్తే తప్పా అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ నేతలు తమకు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వర్తించదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది అంటూ ఫైర్ అయ్యారు. అతను పెట్టే పోస్టులు ఎంతో దారుణంగా ఉన్నాయన్నారు. వాటిపై విచారణ చేస్తుంటే అదికూడా తప్పు అనేలాగ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఒక మహిళ మీద అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని వీరు సమర్ధిస్తారా అని ప్రశ్నించారు. మహిళల మాన, ప్రాణాల గురించి అసభ్యకర పోస్టులు పెట్టాడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐటీడిపి అనే దాంట్లో ఈ విజయ్ దారుణమైన పోస్టులు పెట్టారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ధన, మానాలను దోచుకున్న వ్యక్తులు ఈ టీడీపీ వాళ్లు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వీరి అఘాయిత్యాలపై ప్రతిఘటనగా మావాళ్లు ఎవరైనా పోస్టులు పెడితే తట్టుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన ఇతర వ్యాపారాలకు చంద్రబాబు, లోకేష్ లు సమర్ధిస్తున్నారని దుయ్యబట్టారు.
వీరంతా కలిసి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని నిలదీసారు. దేశంలో ఎవరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చిన జగన్ పై దుష్ర్పచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. చింతకాయల విజయ్ కంటే ఎక్కువగా మేము మాట్లాడగలం..తిట్టగలమని, అయితే, సంస్కారం ఉండటంతో ఆ విధంగా చేయటం లేదని చెప్పుకొచ్చారు. చింతకాయల విజయ్ అనే వ్యక్తిపై చట్టం తనపని తాను చేసుకుంటుందని మంత్రి చెప్పారు. మహిళలపై సీఐడీ దౌర్జన్యం అంటూ తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదని మంత్రి సూచించారు.