జయము జయము చంద్రన్నఅంటూ - తిరుమలలో మంత్రి రోజా..!!
మంత్రి రోజా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ దర్శన సమయంలో దర్శనానంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తన సహజ ధోరణిలోనే టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసారు. చంద్రబాబు వరద ప్రాంతాల్లో బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తిరిగి అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పటం పైన ధ్వజమెత్తారు.

పోలవరం వద్ద భజనలు
సొంత నియోజకవర్గం కుప్పం కు ఏమీ చేయని చంద్రబాబు.. కనీసం రెవిన్యూ డివిజన్ గా కూడా మార్చుకోలేకపోయారన్నారు. ఇప్పుడు ముంపు మండలాలను జిల్లాగా మారుస్తామని చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా.. అప్పులు చేసి ఎంజాయ్ చేసారంటూ ఆరోపించారు. పోలవరం కట్టకుండా జయము జయము చంద్రన్న అంటూ భజనలు చేయించుకుని, చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారన్నారని మండిపడ్డారు.

జగన్ పని చేస్తున్నది వారి కోసమే
ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పేదవారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పోలవరం అంశం కీలకంగా మారింది. రాజీనామాలు - సవాళ్లతో హోరెత్తుతోంది. పోలవరం ఎప్పటి పూర్తవుతుందో చెప్పలేమని మంత్రి అంబటి స్పష్టం చేసారు. పోలవరం పూర్తి చేయటం చేతకాకుంటే తప్పుకోవాలని..తాను పూర్తి చేసి చూపిస్తానంటూ చంద్రబాబు సవాల్ చేస్తున్నారు. గతంలో అసెంబ్లీలో నూ పోలవరం చర్చ సమయంలో ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన కొందరు చంద్రబాబు పేరుతో చేసిన భజన వీడియోను ప్రదర్శించారు.

పోలవరం చుట్టూ రాజకీయం
ఇప్పుడు మంత్రి రోజా సైతం అదే అంశాన్ని ప్రస్తావిస్తూ పోలవరం వద్ద జయము జయము చంద్రన్నా అంటూ భజన చేయించుకోవటం మినహా.. ప్రాజెక్టు కోసం ఏం చేసారని నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రేపు లేదా 3వ తేదీన ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ప్రధానితో భేటీ కానున్నారు. ఆ సమయంలో పోలవరం నిర్వాసితులకు చెల్లించాల్సిన ప్యాకేజీ గురించి క్లారిటీ తీసుకొనే అవకాశం ఉంది. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సీఎం ఇప్పటికే స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications