తమిళనాడు బోర్డర్లో సినీ ఫక్కీలో దోపిడీ- లారీ ఆపి రూ.7 కోట్ల విలువైన సెల్ఫోన్ల చోరీ..
ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో సినీ ఫక్కీలో ఓ దోపిడీ జరిగింది. ఇందులో అచ్చుగుద్దినట్లు సినిమా తరహాలోనే ఆగంతకులు సెల్ఫోన్ల స్టాక్తో వెళ్తున్నలారీని ఆపి రూ. 7 కోట్ల విలువైన స్టాక్ను ఎత్తుకెళ్లారు. నగరి సమీపంలో జరిగిన ఈ ఘటన స్ధానికంగా తీవ్ర కలకలం రేపింది. లారీలో పూర్తి స్టాక్ను కాకుండా తమకు కావాల్సిన విలువైన సెల్ఫోన్లను మాత్రమే ఆగకుంతులు దోచుకెళ్లడం సంచలనంగా మారింది.
తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి ముంబైలోని ఎంఐ ఫోన్ల గౌడౌన్కు సెల్ఫోన్ల లారీ వెళుతోంది. ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోకి లారీ రాగానే మరో లారీని అడ్డుపెట్టి ఆగంతకులు అడ్డగించారు. అడ్డొచ్చిన డ్రైవర్, క్లీనర్ను కట్టిపడేశారు. అనంతరం లారీని తీసుకెళ్లి నగరి సమీపంలోని జాతీయ రహదారిపై వదిలి వెళ్లిపోయారు.
ఈ లారీలో 16 పెట్టెల్లో రూ.12 కోట్ల విలువైన 15 వేల మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో 8 పెట్టెలను మాత్రమే మరో 8 పెట్టెలు వదిలి వెళ్లిపోయారు. దోచుకెళ్లిన సెల్ఫోన్ల విలువ రూ.7 కోట్ల వరకూ ఉండొచ్చి పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 7500 మొబైల్ ఫోన్లు అపహరణకు గురై ఉండొచ్చని తెలుస్తోంది.
తమిళనాడులో ఉండగానే లారీని ఆగంతకులు అనుసరించి ఉంటారని, సరిహద్దుల్లోకి రాగానే నిర్మానుష్య ప్రాంతంలో వారు లారీని వ్యూహాత్మకంగా అడ్డగించి డ్రైవర్, క్లీనర్ను కట్టిపడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా కేసు వివరాలను శ్రీపెరంబదూరులోని ఎంఐ కార్యాలయానికి తెలియజేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.