దొరికిన ఆచూకీ: అమెరికా అదృశ్యమైన గన్నవరం పాస్టర్ కేసులో వీడిన మిస్టరీ
అమరావతి: అమెరికాలో అదృశ్యమైనట్లు భావిస్తున్న గన్నవరానికి చెందిన పాస్టర్ జాన్సన్ చౌదరి (38) కేసులో మిస్టరీ వీడింది. కృష్ణా జిల్లా గన్నవరంలోని సాయినగర్ ప్రాంతానికి చెందిన పాస్టర్ వీరపనేని జాన్సన్ చౌదరిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఓ కేసు విచారణ నిమిత్తం అక్కడి పోలీసులు ఆయన్ని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జాన్సన్ చౌదరి స్వయంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. వివరాల్లోకి వెళితే... ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం జాన్సన్ చౌదరి జూన్ 4వ తేదీన అమెరికా వెళ్లాడు.
షెడ్యూల్ ప్రకారం జులై 12న లాస్ ఏంజిల్స్లో విమానం ఎక్కి లండన్ చేరుకుని, అక్కడి నుంచి 14వ తేదీన హైదరాబాద్లో దిగాల్సి ఉంది. అనంతరం అక్కడ నుంచి జులై 15న గన్నవరానికి చేరుకోవాల్సి ఉండగా ఆయన తిరిగి రాలేదు. దాంతో ఆందోళనకు గురైన ఆయన భార్య కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులను ఆశ్రయించింది.
అమెరికా వెళ్లిన గన్నవరం పాస్టర్ అదృశ్యం: ఏపీలో భార్య ఫిర్యాదు, కేసు నమోదు
పాస్టర్ అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చివరకు ఆయన అమెరికాలో పోలీసుల వద్దే ఉన్నట్లు తెలియడంతో ఒకవైపు ఊరట చెందారు. మరోవైపు అమెరికా పోలీసులు ఆయన్నుఎందుకు అదుపులోకి తీసుకున్నారో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు.
జాన్సన్ చౌదరి 'హోలీ గాడ్ మినిస్ట్రీస్ ఇండియా' అనే సంస్థను స్థాపించి వీరపనేనిగూడెం గ్రామంలో ఓ అనాథాశ్రమం స్థాపనకు స్థలం సేకరించాడు. కాగా ఆశ్రమ స్థాపనకు అవసరమైన నిధుల సేకరణకు అమెరికా వెళ్లారు. అంతేకాదు జాన్సన్ చౌదరి ఆంధ్రప్రదేశ్ టీడీపీ క్రిస్టియన్ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.