తెలంగాణను కించపర్చారా..! : 'అక్కడి వాళ్లకు తెల్లన్నం తెలియదన్న' బాలకృష్ణ
అమెరికా : తన 56వ పుట్టినరోజు వేడుకలను అమెరికాలో ఘనంగా జరుపుకున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణకు సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మాట్లాడిన బాలకృష్ణ.. 'ఒకప్పుడు తెలంగాణ ప్రజానీకానికి అసలు తెల్లన్నం అంటే ఏంటో తెలియదు' అన్న తరహాలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెబుతూ తెలంగాణ విషయాన్ని ప్రస్తావించిన బాలయ్య వివాదస్పద వ్యాఖ్యలకు తెరలేపారు. బాలయ్య మాట్లాడుతూ.. దేశంలో ఆహార భద్రతను 1983లోనే ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ దే అని చెప్పుకొచ్చిన ఆయన, 'తెలంగాణ విషయమైతేనేం.. అసలు తెల్ల అన్నమంటేనే తెలియని అక్కడివారికి, అయితేనేం.. నాలుగు వేళ్లు నోట్టోకి వెళ్లేలా చేసింది ఎన్టీఆర్' అని కామెంట్ చేశారు.
కాగా, బాలయ్య తాజా వ్యాఖ్యలు తెలంగాణను కించపరిచేవిగా ఉండేవడంతో, ఈ విషయం కాస్త వివాదంగా మారే అవకాశాలు లేకపోలేదు. గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు కూడా రాయలసీమను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'గొడ్డు కారం తినే రాయలసీమ జనానికి తెల్లన్నం పరిచయం చేసింది ఎన్టీఆర్' అని అప్పట్లో చంద్రబాబు కామెంట్ చేశారు.

పుట్టినరోజు సందర్భంగా.. అభిమానుల ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేసిన బాలకృష్ట, అనంతరం అభిమానులను, తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్బంగా తండ్రి ఎన్టీఆర్ ను తలచుకున్న ఆయన 'ఎన్టీఆర్' అనే ఆ మూడు అక్షరాల పేరు వింటే గుండె ఉప్పొంగుతుందని చెప్పారు. ఎన్టీఆర్ ని తెలుగు జాతి ఆస్తిగా అభివర్ణించిన బాలకృష్ణ 'అన్నమయ్య, శంకరాచార్యులు, గాంధీ, ఎన్టీఆర్' ఈ నలుగురు మాత్రమే దైవాంశ సంభూతులు అని చెప్పారు.
పుట్టే ప్రతి వ్యక్తికి మరణం ఉంటుందని.. అయితే జీవించే క్రమంలో మడమ తిప్పకుండా రాజీ లేని పోరాటం చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. ఇక ఆయన సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. తన సినిమాలకు చిన్న పిల్లలు కూడా ఆసక్తి చూపించడం, సినిమాల్లో లాగే తొడలు కొట్టడం, మీసాలు మెలేయడం చూస్తోంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.
ఇకపోతే తన ప్రసంగంలో తెలుగు భాష గురించి కూడా ప్రస్తావించిన బాలయ్య సొంత భాషను తల్లిపాలతో పోల్చుతూ పరాయి భాష డబ్బా పాల కింద లెక్క అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications