బైపోల్ కోసం నేను చనిపోవాలట - మరో పిఠాపురం చేస్తామంటున్నారు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. గోదావరి జిల్లాల్లో మూడు పార్టీల మధ్య కొత్త లెక్కలు మొదలయ్యాయి. మూడు పార్టీలు సమన్వయంతో పని చేయాలని పార్టీల నేతలు చెబుతున్నా సాధ్య పడటం లేదు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన చేసిన కామెంట్స్ మూడు పార్టీల్లోనూ చర్చగా మారాయి.
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనతో ఉన్న కొంత మంది నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తాను ఎన్డీఏ ఎమ్మెల్యే ని, నేను చనిపోతే బై ఎలక్షన్స్ వస్తే కొంతమంది ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారంటూ సంచలనానికి తెర లేపారు. ఎవరి త్యాగాల వల్ల తనకు ఎమ్మెల్యే సీటు రాలేదు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే నియోజకవర్గ ప్రజలు తనను గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పుకొచ్చారు. తాను గెలిచాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నానని బొలిశెట్టి వివరించారు.

నియోజకవర్గంలో అధికారులను బెదిరిస్తున్నారని బొలిశెట్టి చెప్పుకొచ్చారు. అధికారంలో తాము ఉన్నామని.. ఎమ్మెల్యే చెప్పేది చేస్తే సహించమని అధికారులను హెచ్చరించటం ఏంటంటూ నిలదీసారు. అధికారులను ఇబ్బంది పెట్టి, బెదిరిస్తే సహించేది లేదు-అధికారులను కాపాడు కుంటానని స్పష్టం చేసారు. తాను చనిపోయిన తర్వాత వారు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నా రని.. ఇది సరైన విధానం కాదన్నారు. తాను ఎవరి దయ దక్షిణ్యాల వలన గెలవలేదని చెప్పారు. తన నియోజకవర్గాన్ని మరో పిఠాపురం చేసేస్తామని అంటున్నారని.. తానేమీ చేతికి గాజులు తొడుక్కోలేదని బొలిశెట్టి తేల్చి చెప్పారు.
తాను స్థలాలు, పొలాలు పూడ్చ లేదని చెబుతూనే..తనకు ఓట్లు వేసిన ప్రజల కోసం తాను పని చేస్తున్నానని వివరించారు. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ను తాను ఇబ్బంది పెట్టలేదు శాసన సభ్యుడిగా తనకు గౌరవం నాకు ఇవ్వాలని సూచించారు. తాను నాశనమై పోవాలని కోరుకునే వారు ఇక తన వద్దకు రావద్దని సూచించారు. టీడీపీ నేతలను ఉద్దేశించి ఇప్పుడు బొలిశెట్టి చేసిన వ్యాఖ్యల పైన కూటమి పార్టీల్లో చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications