కన్ఫ్యూజన్, టిఎస్సార్కి ఓటు మిస్: మోత్కుపల్లి నిరసన
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేసే విషయంలో మంగళగిరి శాసన సభ్యులు కమల గందరగోళానికి లోనయ్యారు. దీంతో ఓటు వేయకుండానే తిరిగి వెళ్లిపోయారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కమల వచ్చారు.
ఓటు వేసేందుకు లోనికి వెళ్లిన ఎమ్మెల్యే.. బ్యాలెట్ పత్రంలో బాక్సుకు ఎదురుగా ఉన్న వాటిలో నెంబర్లు వేయాలా లేక టిక్కులు పెట్టాలా అనే విషయంలో కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో అడిగి తెలుసుకునేందుకు బయటకు వచ్చారు. తిరిగి ఆమెను లోనికి వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతించలేదు.
తనకు టిక్కు పెట్టాలా లేక నెంబర్ వేయాలా తెలియక పోవడం వల్ల ఓటు లేకపోయానని, అడిగి తెలుసుకునేందుకు వచ్చానని చెప్పారు. అయితే, అందుకు నిబంధనలు ఒప్పుకోవని, పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చాక లోపలకు తిరిగి పంపించరని చెప్పడంతో వెనుదిరిగారు.
కమలకు మొదటి ప్రాధాన్యత ఓటును టి సుబ్బిరామి రెడ్డికి, రెండో ప్రాధాన్యత ఓటును కెవిపి రామచంద్ర రావుకు కేటాయించారు. ఆమె కన్ఫూజ్ కావడంతో ఎవరికి ఓటు వేయకుండానే వెళ్లిపోయారు. ఆమె ఖాళీ బ్యాలట్ పత్రాన్ని బాక్సులో వేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు మోత్కుపల్లి నర్సింహులు నిరసన తెలుపుతూ రాజ్యసభ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యసభకు తనను ఎంపిక చేయకపోవడంపై ఆగ్రహంతో ఉన్న మోత్కుపల్లి ఓటు వేయవద్దని నిర్ణయించకున్నారు. శుక్రవారం ఎర్రబెల్లి దయాకర రావు, మహేందర్ రెడ్డిలు మోత్కుపల్లిని బుజ్జగించారు. దీంతో కొద్దిగా తగ్గిన మోత్కుపల్లి ఓటు వేశారు. అయితే తాను నిరసన తెలుపుతూనే ఓటు వేసినట్లు ఆయన తెలిపారు.