ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు టెన్షన్ లో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అనంతలో ఉద్రిక్తత
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా అనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని ముట్టడించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు అన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఫైర్
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పై ఏపీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయనను టిడిపి నుంచి సస్పెండ్ చేయాలని అల్టిమేటం జారీ చేశారు.48 గంటల గడువు ముగియటంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి యత్నం .. భారీగా పోలీసులు
అనంతపురం టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసాన్ని ముట్టడించాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు అని సమాచారం నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే నివాసంతో పాటు పరిసర ప్రాంతాలలో భారీగా మోహరించారు. బందోబస్తు ఏర్పాటు చేసి నివాసానికి వచ్చే మార్గాలలో బారికేడ్ లను ఉంచి వాహన తనిఖీలను కొనసాగిస్తున్నారు. అనంతపురం లోనికి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
జాతీయ రహదారిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన
మరోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ, పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన నివాసంతో పాటు పార్టీ ఆఫీసును కూడా ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని డిమాండ్
ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే ఆయనను తక్షణం టిడిపి నుండి సస్పెండ్ చేయాలంటూ టిడిపి అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications