నేటికీ మోసాలు ఆగట్లేదు: కెసిఆర్, టిడిపి ఎమ్మెల్యే చేరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ సీమాంధ్రుల మోసాలు ఆగడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన సమక్షంలో మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డితోపాటు విద్యార్థి నాయకుడు పిడమర్తి రవి, ఎరోల్లి శ్రీనివాస్తోపాటు సుమారు 2వేల మంది మహబూబ్నగర్ జిల్లా కార్యకర్తలు, వరంగల్ జిల్లా టిడిపి మహిళా అధ్యక్షురాలు ప్రేమలతా రెడ్డి టిఆర్ఎస్లో చేరారు. పార్టీ కండువా కప్పిన కెసిఆర్ వారందర్నీ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సీమాంధ్రుల మోసాలు ఆడటం లేదని ఆరోపించారు. తెలంగాణలోని జిల్లా జడ్జీల నియామకాల్లో ఆంధ్రా ప్రాంతంవారీ వాటా అయిపోయిందని చెప్పారు. ఇకపై తెలంగాణ వారినే జడ్జీలు నియమించాలని అన్నారు. హైదరాబాద్లో 85 మంది న్యాయమూర్తులు ఉంటే అందులో 75 మంది జడ్జీలు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని అన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతున్నందున ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, రాష్ట్రపతికి లేఖ రాస్తానని తెలిపారు.
టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఎల్లారెడ్డికి పాలమూరు జిల్లాలో మంచి పేరుందని, ఆయన ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తారని కెసిఆర్ తెలిపారు. పాలమూరు జిల్లా ఎంపిగా తాను పోటీ చేసిన సమయంలోనే ఎల్లారెడ్డి తనను సంప్రదించారని చెప్పారు. మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎల్లారెడ్డి మక్తల్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని కెసిఆర్ తెలిపారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రేమలతా రెడ్డి తనకు ఆత్మీయురాలని కెసిఆర్ చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ విజయం కోసమే ఆమె పార్టీలో చేరారని చెప్పారు.
తాను తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన సమయంలో విద్యార్థి సంఘాలు అద్భుతమైన పోరాటం చేశాయని అన్నారు. విద్యార్థి సంఘాలు జరిపిన కార్యకలాపాలు పిడమర్తి రవి ఎంతో చురుకుగా పాల్గొన్నారని కెసిఆర్ తెలిపారు. పిడమర్తి రవిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ఈ సందర్భంగా కెసిఆర్ చెప్పారు. గెలిచే స్థానంలోనే రవిని పోటీకి నిలబెడతామని అన్నారు. ఎన్నడినుంచైనా లక్ష మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి రావాలని కెసిఆర్ అన్నారు. ఉద్యమం చేసిన వాళ్లే అధికారంలో కొనసాగాలని ఆయన అన్నారు. పెట్టుబడిదారుల డబ్బుల నుంచి పుట్టిన పార్టీ కాదని, ప్రజల ఇబ్బందులు, కార్మికులు, విద్యార్థలు కష్టాలు నుంచి పుట్టిన పార్టీయే టిఆర్ఎస్ అని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
14ఏళ్ల పార్టీ చరిత్రలో తాము ఎప్పుడూ ప్రజలను డబ్బులు అడగలేదని, ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రజలు తమకు తోచిన మొత్తాన్ని టిఆర్ఎస్ పార్టీకి విరాళంగా అందజేయాలని కెసిఆర్ కోరారు. తెలంగాణ పునర్నిర్మాణం టిఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. పార్టీలో చేరిన దేవరి మల్లప్పకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని ఈ సందర్భంగా కెసిఆర్ చెప్పారు.