వైసీపీ ఎమ్మెల్యే సెల్ఫ్ గోల్ - ప్రత్యర్ధులతో కలిసి, సీటు గోవిందా..!?
అందివచ్చిన అవకాశం ఆ ఎమ్మెల్యే జార విడుచుకుంటున్నారు. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ ముందుకు వెళ్తుంటే.. సొంత పార్టీ నేతలపై ఉక్రోషంతో పార్టీకి నష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదే పదే ప్రస్తావించే దుష్టచతుష్టయంతో కలవటం ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు శాపంగా మారుతోంది. ఇదే విషయం పైన ఇప్పుడు తాడేపల్లిలో చర్చ జరుగుతోంది. తిరిగి సీట్ల ఖరారు వేళ ఈ ఎమ్మెల్యే పైన చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదులు
విజయనగరం జిల్లాలో 2019లో వైసీపీ అన్ని స్థానాల్లో గెలుపొంది క్లీన్ స్వీప్ చేసింది. తిరిగి రాష్ట్రమంతా వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం నుంచి క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ఎమ్మెల్యేల పని తీరు ఆధారంగా టికెట్లు ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటానని స్పష్టంగా వెల్లడించారు.

ఈ సారి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం పైన వస్తున్న నివేదికల పైన పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడ పార్టీ ఎమ్మెల్యే వ్యతిరేక మీడియా మద్దతుతో సొంత పార్టీ నేతల పైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారనే ఫిర్యాదులు..ఆధారాలతో సహా పార్టీ నాయకత్వానికి చేరాయి. పార్టీలో సమస్యలు ఉంటే చర్చించాలని..ప్రత్యర్ధులకు అవకాశం ఇచ్చే ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని పార్టీ నాయకత్వం స్పష్టం చేస్తోంది.
పార్టీ నాయకత్వం ఆగ్రహం
కొంత కాలంగా పార్వతీ పురం ఎమ్మెల్యే జోగారావు పైన వస్తున్న నివేదికలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ సమయంలో ఐ ప్యాక్ సంస్థ ఆ నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లను ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే తీరుతో పార్టీకి నియోకజవర్గం చేయి దాటే అవకాశం ఉందని నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. టికెట్ ఖరారు కావటంలో జిల్లా నేతలు..పార్లమెంట్ ఇంఛార్జ్ లు.. ప్రాంతీయ సమన్వయకర్తల నివేదికలు అనుకూలంగా ఉంటేనే అవకాశం దక్కుతుంది.

గత ఎన్నికల్లో ప్రస్తుత మణ్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు సిఫారసు మేరకే జోగారావు కు టికెట్ వచ్చిందనేది ఓపెన్ సీక్రెట్. అధిష్టానం ఈసారి కూడా వీరి అభిప్రాయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ, జోగారావు తీరు పైన జిల్లా మంత్రులు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య నేతలు జోగారావు తీరుతో విసుగు చెందారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం సహకరించే పరిస్థితి కనిపించటం లేదని నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం.

టికెట్ రేసులో ముగ్గురు అభ్యర్దులు
ఇక వచ్చే ఎన్నికల్లో ముగ్గురి పేర్లు తెర మీదకు వచ్చాయి. ఈ ముగ్గురి అభ్యర్ధిత్వం పైన సర్వేలు కొనసాగుతున్నాయి. వారిలో జమ్మాన ప్రసన్న కుమార్.. శాంతి కుమారి..సవరపు జయమని పేర్లు తెర మీదకు వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్ధిగా జమ్మాన ప్రసన్న కుమార్ పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చిరంజీవులు చేతిలో ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జోగారావు వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇప్పుడు జోగారావు స్వీయ తప్పిదాలు..స్థానిక పార్టీ ముఖ్య నేతలను లెక్క చేయని తనంతో వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ నాయకత్వం సమీక్ష ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications