విహారంలో విషాదం: అమెరికాలో టీడీపీ ఎమ్మెల్యే మేనల్లుడి మృతి
అమెరికాలో వివాహ వార్సికోత్సవాన్ని ఆనందంగా జరుపుకునేందుకు వెళ్లిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వాటర్ ర్యాంప్ చేస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు మేనల్లు
వాషింగ్టన్/విజయవాడ: అమెరికాలో వివాహ వార్సికోత్సవాన్ని ఆనందంగా జరుపుకునేందుకు వెళ్లిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వాటర్ ర్యాంప్ చేస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు మేనల్లుడు ప్రాణాలు కోల్పోగా, కుమారుడు, కుమార్తె ప్రాణాలు దక్కించుకున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు చెల్లెలు తిరుపతమ్మ. ఈమె కుమారుడు దినేష్. ఇతను విజయవాడలో వజ్రాల వ్యాపారం చేస్తున్నారు. అమెరికాలో ఉంటున్న బంధువు సింహాద్రి పిలుపు మేరకు తన వివాహ వార్షికోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఏప్రిల్ 13న ఆయన తన భార్యతో కలిసి అమెరికా వెళ్లారు.
ఏప్రిల్ 16న వివాహ వార్షికోత్సవం సంబరంగా నిర్వహించుకున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున అమెరికాలోనే ఉంటున్న బాబూరావు చిన్న కుమార్తె యశశ్వని, కుమారుడు భువనేష్లతో కలిసి దినేష్ దంపతులు కెనాన్ రాయల్ సిటీ సమీపంలోని వాటర్ ర్యాపింగ్లో పడవ షికారుకు వెళ్లారు. అందరూ కలిసి తెడ్లతో తామే పడవను నడుపుతూ కొద్దిసేపు షికారు చేశారు.
రెండు కొండల మధ్యకు వెళ్లేసరికి మంచు కరిగి పెద్ద ప్రవాహం వారున్న పడవ మీదికి దూసుకొచ్చింది. దీంతో వారి పడవ తిరగబడింది. ఈ సంఘటనలో దినేష్ పెద్ద బండరాయికి గుద్దుకుని మంచులో కూరుకుపోయారు. మిగిలిన వారు పడవను పట్టుకుని ఉండిపోయారు. విషయాన్ని గుర్తించిన రక్షక దళం వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్లింది.
అప్పటికే దినేష్ మృతిచెందారు. మిగిలిన వారిని రక్షక దళం రక్షించింది. మేనల్లుడి మృతితో కదిరి కుటుంబం విషాదం నెలకొంది. విషయం తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు ఎమ్మెల్యే బాబురావుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు.
కాగా, కుమారుడి మరణంతో దినేష్ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, పెళ్లైన ఏడాది ముగియక ముందే తమను విడిచి వెళ్లాడని కన్నీటిపర్యాంతమయ్యారు. కాగా, గత సంవత్సరం ఏప్రిల్ 21న అవనిగడ్డ కు చెందిన సింహాద్రి ప్రనూషాతో దినేష్కు వివాహమైంది. రెండు మూడు రోజుల్లో దినేష్ మృతదేహాన్ని విజయవాడకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.