ఏపీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర : బయట పెట్టిన సీఎం కేసీఆర్..!!
ఏపీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందా. ఇందు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయా. ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది. తెలంగాణలో వెలుగు చూసిన ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల్లో అనేక అంశాలు బయటకు వచ్చాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రతినిధులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులు జరిపిన సంభాషణల వీడియోలను సీఎం కేసీఆర్ విడుదల చేసారు. అందులో 70 నిమిషాల వీడియోలో రామచంద్ర భారతి, సింహయాజీ తాము గతంలో ఏఏ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు చేసిందీ..ఎక్కడెక్కడ ప్రభుత్వాలు పడగొట్టిందీ వివరించారు.
70 నిమిషాల వీడియో ఆధారంగా
కర్ణాటకలో తాము 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి అందులో వివరించారు. కానీ, ఏపీ - తెలంగాణ రాజకీయాలు మాత్రం వేరని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నియోజకవర్గంలో ఖర్చు చేసే మొత్తంతో తాము ఇతర రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్ర ఎన్నికలే నిర్వహిస్తామని పేర్కొన్నారు. కేంద్రంలో మరో 15 ఏళ్లు బీజేపీనే అధికారంలో ఉంటుందని ఆ ఇద్దరు చెప్పుకొచ్చారు. తాము తెలంగాణ తరువాత ఏపీ అంటూ సింహయాజీ చెప్పటం సంచలనంగా మారింది.

హిట్ లిస్టులో ఏపీ ప్రస్తావన
ఇదే అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తన మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ రాష్ట్రంలో తమ ప్రభుత్వం పడగొడతామంటే తాను చూస్తూ కూర్చోవాలా అంటూ ప్రశ్నించారు. బీజేపీ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న ఆ ముగ్గురు పదే పదే కమలం పార్టీ ముఖ్య నేతలు ప్రస్తావించటం వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియోలను సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టుతో పాటుగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు..అన్ని పార్టీల అధినేతలకు పంపారు. తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్ల్లో కూలగొడతాం. రాజస్థాన్లో 21 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వచ్చేశారు. ఢిల్లీలో 44 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పటం వీడియోలో ఉందని వివరించారు.
ఏపీ రాజకీయాల్లో సంచలనం
తనకు సమాచారం వచ్చిన వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రిని అప్రమత్తం చేశానన్నారు. వాళ్ల ఎమ్మెల్యేలను కొన్నారనే విషయాన్ని వివరించి.. జాగ్రత్త పడాలని చెప్పగా, వాళ్లు స్పందించారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన 70 నిమిషాల వీడియోలో సింహయాజీ, రామచంద్ర భారతి చెప్పారు ఏపీ గురించి ప్రస్తావన చేయటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. ఏపీలో అధికార వైసీపీ..ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలో ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఇక, ఏపీ అధికార పార్టీ నేతలు...ప్రతిపక్షాలు ఈ తాజా వ్యవహారం పైన ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications