రైతు స్పెల్లింగ్ కూడా తెలియని రోజా మమ్మల్ని విమర్శించడమా?: సోమిరెడ్డి
ప్రతీ ఏటా గుంటూరు మిర్చి యార్డులో హమాలీలకు, గుమాస్తాలకు 40రోజుల పాటు సెలవులిస్తారని, ఇది ఎప్పటినుంచో జరుగుతోందని అన్నారు.
నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే రోజా రైతుల పక్షాన మాట్లాడుతూ టీడీపీని విమర్శించడాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతు అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియని రోజా.. తమ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. తనకు తెలిసి రోజా ఇంతవరకు పొలానికి కూడా వెళ్లి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా ఉండాలో చెప్పే హక్కు రోజాకు లేదన్నారు సోమిరెడ్డి. ఇక మిర్చి గిట్టుబాటు ధర గురించి ప్రస్తావిస్తూ.. జగన్మోహన్ రెడ్డికి మిర్చి కొనుగోలుపై కనీస అవగాహన కూడా లేదన్నారు. ప్రతీ ఏటా గుంటూరు మిర్చి యార్డులో హమాలీలకు, గుమాస్తాలకు 40రోజుల పాటు సెలవులిస్తారని, ఇది ఎప్పటినుంచో జరుగుతోందని అన్నారు.
ఇదేదో తాము కొత్తగా కల్పించినట్లు, కావాలనే సెలవులు ఇచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఇటీవలే హమాలీలతో సమావేశం నిర్వహించి, మానవత్వంతో రైతులకు సహకరించాలని ప్రభుత్వం తరుపున కోరామన్నారు. తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి హమాలీలు, గుమాస్తాలు మిర్చి కొనుగోలుకు సహకరిస్తున్నారని చెప్పారు. ఇదేమి తెలియకుండా జగన్ తనకు ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు.