పదవులు ముఖ్యమా.. పౌరుషం ఏమైంది.. వాటిపై ఉన్న శ్రద్ధ దీనిపై ఎందుకు లేదు?: రోజా
విశాఖపట్నం : విశాఖకు రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర గురువారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ యాత్రకు పార్టీ ఎమ్మెల్యే రోజా సంఘీభావం తెలిపారు.
ఈ పాదయాత్రలో పాల్గొన్నఆమె మాట్లాడుతూ విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ కోసం బాధ్యతగల యువకుడిగా అమర్నాథ్ చేస్తున్న ఈ ఆత్మగౌరవ యాత్రకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆశీస్సులున్నాయని తెలిపారు.
పదవులు కాదు.. ప్రజల ఆకాంక్ష ముఖ్యం
ఈ సందర్భంగా టీడీపీపై రోజా నిప్పులు చెరిగారు. ‘టీడీపీ ఎంపీలు దద్దమ్మల్లా పదవులు పట్టుకుని పాకులాడుతున్నారని, రాజీనామాలు చేసి ప్రజల తరఫున పోరాడలేరా? అని ప్రశ్నించారు.
ఆయన పౌరుషం ఏమైంది?
కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పౌరుషం ఏమైంది? మోదీ కేబినెట్లో నోరు మూసుకుని ఉన్నారు. పదవులు కాదు... ప్రజల ఆకాంక్ష ముఖ్యం. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంటూ పదవులు పొందటం వల్లే కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని ఆమె దుయ్యబట్టారు.
వాటిపై ఉన్న శ్రద్ధ.. దీనిపై లేదు
ఈ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు పేపర్ల లీక్, మరో మంత్రి నారాయణకు ర్యాంకులపై ఉన్న శ్రద్ధ రైల్వేజోన్, ప్రత్యేక హోదాపై లేదన్నారు. వియ్యంకులు ఇద్దరికి ల్యాండ్ పూలింగ్ కుంభకోణంపై ఉన్న శ్రద్ధ విశాఖ ప్రాంత ప్రయోజనంపై లేదు.
టైమ్ అంతా దానికే...
బ్యాంకు రుణాల కేసులో బయటపడేందుకు గంటాకు కేంద్రంలో పెద్దల కాళ్లు పట్టుకునేందుకే టైమ్ సరిపోతోంది. అందుకే రైల్వే జోన్పై ఆయన మాట్లాడరని దుయ్యబట్టారు. మరో మంత్రి అయ్యన్నపాత్రుడుకు బాక్సైట్, గంజాయి రవాణాపై ఉన్న శ్రద్ధ రైల్వే జోన్పై లేకపోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు.
ఆయన టీడీపీ సర్కారుకు పావు...
ఇక జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకి విశాఖ ప్రాంత ప్రయోజనాలు పట్టవని, అసెంబ్లీ సమావేశాలో వైఎస్ జగన్తో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తిట్టించడానికి ఆయన్ని టీడీపీ సర్కార్ పావుగా వాడుకుంటోందని విమర్శించారు. అనవసరం అయిన విషయాల్లో నోరు పారేసుకోవడం మాత్రం చూస్తుంటాం కానీ, రైల్వే జోన్పై మాత్రం మాట్లాడరని రోజా ఎద్దేవా చేశారు.
పదవులు లేకపోతే బతకలేరా?
మంత్రి పదవులు రాలేదని టీడీపీ నేతలు రాజీనామాలు చేశారు. ఏం పదవులు లేకుంటే బతకలేరా? అదే ప్రత్యేక హోదా, రైల్వేజోన్ కోసం ఎప్పుడైనా రాజీనామాలకు సిద్ధపడ్డారా? అని ప్రశించారు. బీసీ, మహిళలపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారన్నారు.
మహిళలపై ‘బాబు' వివక్ష...
ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పీతల సుజాతను మంత్రి పదవి నుంచి తొలగించారని. లాస్ట్ ర్యాంక్ వచ్చిన నారాయణకు అదనపు శాఖ అప్పగించారని, ఇదేనా చంద్రబాబు చాణక్యం అని ప్రశ్నించారు. అసలు ప్రజలచే ఎన్నిక కాని లోకేశ్కు ప్రాముఖ్యం ఉన్న శాఖలిచ్చారని, మంత్రుల సంఖ్యను పెంచి.. మహిళల సంఖ్యను తగ్గించారని రోజా ఎద్దేవా చేశారు.