పవన్ కల్యాణ్ పార్టీలోకి రోజా!? సర్వే ప్రభావం, జగన్ తో అంతరం, నాగబాబు సహకారం!
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఆ పార్టీ అధినేత జగన్ వైఖరితో విసిగిపోయారని, ఆమె త్వరలోనే పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో చేరబోతున్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా ఆ పార్టీతో విసుగెత్తిపోయారా? పార్టీ అధినేత జగన్కు.. రోజాకు మధ్య అంతరం పెరుగుతోందా? తన రాజకీయ భవితను నాశనం చేస్తున్న కొందరు వైసీపీ నేతల వైఖరికి రోజా మనస్థాపం చెందారా?
చదవండి: టిడిపికి ఎన్ని సీట్లు, పవన్ కళ్యాణ్ మాటేమిటి: జగన్కు ప్రశాంత్ కిషోర్ సర్వే షాక్?
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా వైసీపీ వీడనున్నారా? ఆమె త్వరలోనే పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరనున్నారా? నాగబాబు ద్వారా రోజా పవన్ కల్యాణ్ ను కలిశారా? ఆమెను జనసేనలోకి పవన్ సాదరంగా ఆహ్వానించారా? ప్రస్తుతం ఈ ఊహాగానాలే సర్వత్రా వినిపిస్తున్నాయి.
వైసీపీలో ప్రాముఖ్యత తగ్గిందా?
వైసీపీ ఎమ్మెల్యే రోజా త్వరలోనే ఆ పార్టీని వీడి పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం వైసీపీలో తన ప్రాముఖ్యత తగ్గిపోతోందని రోజా భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా గతంలో ఇచ్చినంత ప్రాముఖ్యత ఇప్పుడు తనకు ఇవ్వడం లేదని రోజా మధనపడుతున్నట్లు సమాచారం.
జగన్ తీరుతో మనస్థాపం...
వైసీపీ అధినేత జగన్ సైకాలజీ స్వతహాగానే యూజ్ అండ్ త్రో పద్ధతిలో ఉంటుందని ఆయన బాధితులు చెబుతూ ఉంటారు. అవసరం తీరగానే అవతలకి విసిరేసే నాయకత్వం తీరు కారణంగానే ఆ పార్టీ అంతలా వెనుకబడిపోయిందని, ప్రజలు నమ్మని స్థితికి చేరుకుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజా కూడా ఆ పార్టీ తీరుతో విసిగెత్తిపోయారని చెప్పుకుంటున్నారు.
సర్వేలో రోజాకు వ్యతిరేకం...
ఇటీవల విశాఖపట్టణంలో వైసీపీ నిర్వహించిన మహాధర్నాకు రోజా డుమ్మా కొట్టారు. దీనికి కారణం.. ఆ పార్టీ అధినేత జగన్ క్లాస్ పీకడమే అనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల వైసీపీ నిర్వహించిన సర్వేలో.. చిత్తూరు జిల్లాలో పార్టీ బలహీనపడినట్లుగా స్పష్టమైంది. అంతేకాదు, ఎమ్మెల్యే రోజా వ్యవహారం పార్టీకి చేటు తెస్తోందని కూడా ఆ సర్వేలో తేలినట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రజా సమస్యలపై పోరాడాల్సిందిపోయి మీడియాలో హైలైట్ కావడానికి రోజా చేస్తున్న ట్వీట్లు ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణంగా సర్వే ద్వారా తేల్చారు. ఈ పరిణామాలన్నీ రోజాను జనసేన దిశగా నడిపిస్తున్నాయని చెబుతున్నారు.
జనసేనలోకి స్వాగతం?
బుల్లితెరపై టాప్ రేటింగ్ షోగా పేరుతెచ్చుకున్న ‘జబర్దస్త్'లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుతో ఏర్పడిన సాన్నిహిత్యంతో రోజా తన బాధను పంచుకున్నారనే ఊహాగానం వినిపిస్తోంది. నాగబాబు ద్వారా విషయాన్ని పవన్ వరకు తీసుకువెళ్లారని, ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రోజాకు జనసేనలో సాదరస్వాగతం పలికారని మరో ఊహాగానం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.
నాగబాబు సహకారంతో...
పవన్ పార్టీ జనసేన తరపున కాకినాడ నియోజకవర్గంలో నిలబడనున్న నాగబాబు రోజాను ఓదార్చి ఆమెకు జనసేనలో మార్గం సుగమం చేశారట. రోజా కూడా రాయలసీమ నుంచే ఎంపీగా నిలబడే ఏర్పాట్లు.. ఒప్పందాలు జరుగుతున్నట్లు వినికిడి. మొత్తానికి ఇదే గనుక నిజమైతే.. త్వరలోనే ఎమ్మెల్యే రోజా వైసీపీని వీడి జనసేనలో చేరడం ఖాయమంటున్నారు.