చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి... అమరావతి భూకుంభకోణంపై ఎమ్మెల్యే రోజా...
అమరావతిలో రాజధాని పేరుతో జరిగిన భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు,ఆయన బినామిలు గజగజ వణుకుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అమరావతిలో భారీ భూకుంభకోణం జరిగిందని... చంద్రబాబు,ఆయన బినామీలు అక్కడ వేల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు.
Recommended Video

హైకోర్టు ఆర్డర్ బాధాకరమన్న రోజా...
భూకుంభకోణం కేసులో ఓ న్యాయవాదిపై కేసు నమోదు చేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం బాధాకరమన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని... ఎంతోమంది మేదావులు హైకోర్టు తీర్పుపై విస్మయం వ్యక్తం చేశారని అన్నారు. అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని పేర్కొన్నారు. అప్పట్లో పోలవరం ప్రాజెక్టును ఏటీఎం తరహాలో వాడుకున్నారని ప్రధాని అన్నారని గుర్తుచేశారు.

దమ్ముంటే సీబీఐ విచారణకు...
ఏసీబీ అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేసిందని రోజా అన్నారు. చంద్రబాబు తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని... ఆయనకు దమ్ముంటే అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ అక్రమాల మీద సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు. అంతర్వేదిలో రథం తగలబడిన ఘటనలో ప్రభుత్వ తప్పు లేకపోయినా సీఎం జగన్ సీబీఐ విచారణకు ఆదేశించారని చెప్పారు. అప్పట్లో వైఎస్ సైతం తన కొడుకు తప్పు చేసి ఉంటే అసెంబ్లీ సాక్షిగా ఉరితీయాలని చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు స్టేలపై ఆధారపడి బతికే వ్యక్తి అని,కోర్టులు కూడా అందరికీ ఒకేలా న్యాయం జరిగేలా చూడాలని రోజా విజ్ఞప్తి చేశారు.

అమరావతి కుంభకోణంపై ఏసీబీ కేసు..
అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ మంగళవారం(సెప్టెంబర్ 15) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్పై పూర్తి స్థాయి దర్యాప్తుకు సిద్దమవుతున్న ఏసీబీ... ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫైబర్ గ్రిడ్,చంద్రన్న కానుకల పేరుతో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండింటిపై సీబీఐ దర్యాప్తుకు కేంద్రం నుంచి తక్షణ స్పందన వచ్చేలా ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలను జగన్ ఆదేశించారు. కాబట్టి మున్ముందు ఈ రెండు కేసులు కూడా చంద్రబాబును వెంటాడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications