సెటిల్మెంట్ల సీఎంగా చంద్రబాబు.. రాజధానిలో రౌడీయిజం నడుస్తోంది: రోజా
సీఎం చంద్రబాబు సెటిల్మెంట్ల సీఎంగా మారిపోయారని రోజా ఆరోపించారు. ఇటువంటి సీఎం తమకు వద్దని, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి: రవాణా శాఖ అధికారి పట్ల టీడీపీ సభ్యులు చేసిన గలాటా ఆ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా తయారైంది. వివాదం మరింత ముదిరి పార్టీకి డ్యామేజీ జరగకముందే.. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను పిలిపించుకుని సీఎం చంద్రబాబు నాయుడు వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.
రవాణ శాఖ కమిషనర్ కు బాలసుబ్రహ్మణ్యంకు నేతలు క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి ఇంతటితో తెరపడినట్లే కనిపిస్తున్నా.. ప్రతిపక్ష పార్టీ సహా ఆరెంజ్ ట్రావెల్స్ లాంటి ప్రైవేట్ ట్రావెల్స్ కేశినేని ఆగడాలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా దీనిపై స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ తీరును తప్పుపడుతూ ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎం చంద్రబాబు సెటిల్మెంట్ల సీఎంగా మారిపోయారని రోజా ఆరోపించారు. ఇటువంటి సీఎం తమకు వద్దని, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీయే అధికారిపై దాడి చేసిన నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి వారిని వెనుకేసుకొస్తున్నారని మండిపడ్డారు. అధికారులకు నేతలకు మధ్య సెటిల్ మెంట్లు కుదురుస్తున్న తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం రౌడీయిజానికి అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదని, చీప్ మినిస్టర్ గా మారిపోయారని ఈ సందర్బంగా రోజా ఎద్దేవా చేశారు. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ నేత దాడికి పాల్పడినప్పడు, టీడీపీ మహిళా నేత జానీమూన్ కు, మంత్రి రావెలకు మధ్య వివాదం నెలకొన్నప్పుడూ.. చంద్రబాబు ఇదే తరహా సెటిల్మెంట్లతో వివాదాలను సద్దుమణిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.