ఎవరికి పిచ్చెక్కిందో జనానికి తెలుసు.. ప్రశ్నలు ఎదుర్కోలేకే కుట్రలు: రోజా
వైసీపీ నేతలకు పిచ్చెక్కిందని కొంతమంది టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, అసలు పిచ్చి ఎవరికెక్కిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని రోజా అన్నారు.
తిరుపతి: నందిగామ ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ తో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పై క్రిమినల్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కేసులను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో తిరుపతిలో నేడు ధర్నా నిర్వహించారు.
జగన్ పై కేసులను వ్యతిరేకిస్తూ కార్యకర్తలంతా ధర్నాలో పాల్గొన్నారు. స్థానిక భవానీ నగర్ సర్కిల్ వద్ద బైఠాయించిన కార్యకర్తలు నల్లబాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. జగన్ పై కేసుల వెనుక ప్రభుత్వ కుట్రలు ఉన్నాయని ఈ సందర్బంగా రోజా ఆరోపించారు.
ప్రతీ అసెంబ్లీ సమావేశానికి ముందు కావాలనే ఏదో ఒక గొడవ క్రియేట్ చేస్తున్నారని రోజా ఆరోపించారు. అసెంబ్లీలో తాము అడిగే ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికే ఇలా గొడవలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

టీడీపీ అన్యాయాలను ప్రశ్నిస్తామన్న కారణంతోనే ఈ కుట్రలకు తెరలేపారని విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలకు పిచ్చెక్కిందని కొంతమంది టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, అసలు పిచ్చి ఎవరికెక్కిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు రోజుకో స్టేట్ మెంట్ ఇస్తూ రోజుకొకలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
తాము తప్పులు చేయలేదు కాబట్టి ఎలాంటి కేసులు ఎదుర్కోవడానికైనా సిద్దం అని ప్రకటించారు.
టీడీపీ ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోకపోతే వ్యవస్థ భ్రష్ట పడిపోతుందని విమర్శించారు. ప్రతీది తానే చేశానని చెప్పుకునే చంద్రబాబు సింధుకు గోల్డ్ మెడల్ తానే తెచ్చానని, హైదరాబాద్ ను ప్రపంచ పటంలో తానే పెట్టానని గొప్పగా ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. పార్లమెంటీరయన్ల సదస్సుకు తనను అడ్డుకుని చట్టాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీయడానికే ప్రైవేటు బస్సులకు అనుమతులిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications