బాబు మనువడు ఏడ్చినా జగనే గిచ్చాడంటారేమో!.. ఛాంబర్ లీకేజీ కుట్రే: రోజా
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఏపీలో ఏ ఘటన జరిగినా.. అది జగన్ వల్లే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వం మీద ఏ విమర్శ వచ్చినా.. వెంటనే దాన్ని ప్రతిపక్షం మీదకు నెట్టేసే ప్రయత్నాలు జరుగుతాయన్న అపవాదు ఉంది. అటు వైసీపీ కూడా టీడీపీతో ఎప్పుడెప్పుడు కయ్యానికి కాలు దువ్వుదామా అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ఈ రెండు పార్టీల తీరుతో అసలు విషయం పక్కకుపోయి.. అంతా మీరే చేశారు అన్న తరహాలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం తొలి నుంచి జరుగుతూనే ఉంది.
తాజాగా ఈ రెండు పార్టీలు జగన్ ఛాంబర్కు చిల్లులు పడటాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. లీకేజీకి కారణాలు వెతకాల్సింది పోయి.. కుట్ర కోణం అంటూ అధికార పార్టీ ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో ఇది ముమ్మాటికీ జగన్పై జరిగిన కుట్రేనని వైసీపీ కూడా ఆరోపిస్తోంది.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. టీడీపీ నేతల పథకం మేరకే జగన్ ఛాంబర్లో లీకేజీ వ్యవహారం జరిగిందని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ఏపీలో ఏ ఘటన జరిగినా.. అది జగన్ వల్లే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ నేతల తీరును ఎద్దేవా చేస్తూ.. ఎప్పుడైనా చంద్రబాబు మనువడు దేవాన్ష్ ఏడ్చినా జగనే గిచ్చి ఉంటారంటారేమో! అన్నారు. జగన్ ఛాంబర్లో లీకేజీపై విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు.