ఇంతకంటే పెద్దవే చూశాం: 'తమిళనాడులో జయలలితను అవమానిస్తే ఏం జరిగింది'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. మూడో ప్రారంభమైన శాసనసభ వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలతో దద్దరిల్లింది. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు.
అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్షం గొంతు నులిమేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇంతకంటే పెద్దవే చూశామని, తమిళనాడులో జయలలితను అవమానిస్తే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ అడ్రస్ లేకుండా పాయిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రోజా పట్ల అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు అసమంజసం, అప్రజాస్వామికమన్నారు.
అసెంబ్లీ ఆవరణలోకి మాజీ ఎమ్మెల్యేలే వస్తున్నారని అలాంటిది ఎమ్మెల్యేగా ఉన్న రోజా రావడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. కావాలనే మహిళా మార్షల్స్తో ఆమెను బయటకు గెంటేశారన్నారు. ఇటీవల ఓ టీడీపీ ఓ టీడీపీ కార్పొరేషన్ చైర్మన్ మీడియా పాయింట్లో కూడా మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి స్వయంగా నేరుగా మైకుల్లోనే విపక్ష సభ్యుల అంతు తేలుస్తానని మాట్లాడతారని అలాంటిది ఆయనపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోరన్నారు. అధికార పార్టీ సభ్యులైన అచ్చెన్నాయుడు, బొండా ఉమామహేశ్వరరావు, యనమల రామకృష్ణుడు అయితే జగన్ గురించి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి నీచాతినీచంగా మాట్లాడారన్నారు.
అధికార పార్టీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అయితే అసెంబ్లీలోనే సమాధి కడతామన్న ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరన్నారు. ఇక బుచ్చయ్య చౌదరి అయితే రోజూ ఏం మాట్లాడతారో తెలియంది కాదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసే ముందు ఆ నిబంధనలు సీఎంకు, మంత్రులకు వర్తించవా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నులిమేస్తుందని, స్పీకర్ తన ద్వందవైఖరిని మానుకోవాలని సూచించారు. మమ్మల్నందరినీ మూడు నాలుగేళ్లు సస్పెండ్ చేసినా భయపడే ప్రశ్నే లేదని ఆయన అన్నారు.