బొత్స ఎఫెక్ట్: జగన్పై ఎమ్మెల్యే సుజయకృష్ణ అసంతృప్తి
విజయనగరం: మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేరికతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా బొత్స సొంత జిల్లా విజయనగరంలో రాజకీయ సమీకరణాల్లో తేడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తన ప్రత్యర్థి అయిన బొత్స సత్యనారాయణను పార్టీలో ఎలా చేర్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స చేరికతో అసంతృప్తిగా ఉన్న రంగారావు భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు బొబ్బిలికోటలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
జగన్ వ్యవహారశైలిపై కార్యకర్తల సమావేశంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మారాలంటూ ఆయన అనచరులు సుజయకృష్ణపై ఒత్తిడి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కోలగట్ల సుజయకృష్ణకు నచ్చజెప్పేందుకు బొబ్బిలికోటకు బయలుదేరారు.
సుజయకృష్ణ రంగారావు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలియడంతో ఇతర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా రంగంలోకి దిగారు. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ కుటుంబం గత కొంత కాలంగా పూర్తి ఆధిపత్యం సాగిస్తూ వస్తున్నారు.