నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ఆకస్మిక మృతి
విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామ తెలుగుదేశం శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు (62) గుండెపోటుతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కంచికచర్ల మండలం పరిటాలలో 1952 మే 1వ తేదీన జన్మించారు. ఆయన షడ్రక్, సుందరమ్మ దంపతులకు జన్మించారు.
న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆయన జయప్రకాష్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. నందిగామ బార్ అసోసియేషన్కు మూడు పర్యాయాలు అధ్యక్షులుగా పనిచేశారు. వీరులపాడు ఎంపీపీగా, జడ్పీటీసీ సభ్యునిగా ఆయన ప్రజలకు సేవలందించారు. నందిగామ నియోజకవర్గాన్ని 2009లో ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో కూడా ఆయన నందిగామ నుంచి విజయం సాధించారు. ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన కన్నుమూశారు. ప్రత్యర్థిపై ఆయన 5,212 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇరిగేషన్ మంత్రి ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన ఆదివారం పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు. సాయంత్రం నందిగామ వచ్చిన ఆయనకు రాత్రి 11గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో స్థానిక మదర్ థెరిస్సా ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు.
తంగిరాల ప్రభాకర రావు మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన నందిగామలో తంగిరాల ప్రభాకర రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుప్పం బయలుదేరి వెళ్తారు. తంగిరాల అంత్యక్రియలు సోమవారం సాయంత్రం జరగనున్నాయి.