టిడిపిలో చిచ్చు: వల్లభనేని వంశీ సీరియస్, ఫోన్ చేసి పిలిచిన దేవినేని ఉమ?
విజయవాడ: రైవస్ కెనాల్ వద్ద వివాదం తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపింది. దీనికి కావాల్సిన స్థల సేకరణ నిమిత్తం రామవరప్పాడులోని ఇళ్లు తొలగింపుకు అధికారులు నోటీసులు ఇవ్వగా, ఆదివారం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అడ్డుకోవడం, అతని పైన పడమట పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే.
వల్లభనేని వంశీని ఏ1 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. దీంతో వంశీ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వెంటనే తన గన్మెన్లను వెనక్కి పంపించారు. ఇది పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. తన పైన కేసు నేపథ్యంలో తాను జైలుకు వెళ్తానని, బెయిల్ కూడా తీసుకోనని వంశీ చెప్పారు.
ఇది టిడిపిలో చిచ్చు రాజేసిన నేపథ్యంలో ఎంపీ కొనకళ్ల నారాయణ.. వంశీతో ఫోన్లో మాట్లాడి బుజ్జగించారని తెలుస్తోంది. కొనకళ్ల సోదరుడు కొనకళ్ల జగన్నాథరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు అర్జునుడు తదితరులు వంశీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

తన పైన కేసు పెట్టడాన్ని వల్లభనేని వంశీ చాలా సీరియస్గా తీసుకున్నారని తెలుస్తోంది. దేవినేని బాజీకి చెందిన హోటల్ గురించి మాట్లాడటంతో తన పైన అక్రమ కేసులు బనాయించారని వంశీ వారితో ఆగ్రహంతో మాట్లాడారని తెలుస్తోంది. అయితే, ఎట్టకేలకు కొనకళ్ల బుజ్జగింపులకు వంశీ కొంత తగ్గినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు, రామవరప్పాడులో నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారుల విషయమై మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఎమ్మెల్యే వంశీ ఇతర టిడిపి నేతలు దేవినేని ఉమ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉమ ఫోన్లో తొలుత వంశీలో మాట్లాడిన తర్వాత వెళ్లారు. అధికారులు తొందరపడి నోటీసులు ఇచ్చేందుకు రావడం సరికాదని దేవినేని ఉమ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. దీంతో పరిస్థితి సద్దుమణిగిందని సమాచారం.












Click it and Unblock the Notifications