YCPలో పెరుగుతున్న ''రఘురామకృష్ణంరాజులు?''
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెమ్మది నెమ్మదిగా ఎంతోమంది రఘురామకృష్ణంరాజులు తయారవుతున్నారని ఇటీవల జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నట్లు సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ రెబల్ ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు. సాంకేతికంగా మాత్రమే ఆయన వైసీపీలో ఉన్నారు. రెండున్నర సంవత్సరాల నుంచి ఎంపీకి, పార్టీకి జరుగుతున్న పోరు అందరికీ తెలిసిందే.
రోజురోజుకు పెరిగిపోతున్నారు..
అటువంటి రఘురామకృష్ణంరాజులు ప్రభుత్వంలో రోజురోజుకు పెరిగిపోతున్నారనే అభిప్రాయం ఇప్పుడు ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ లాంటివారే కాకుండా ఇంకెంతోమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రెండో విడతలో మంత్రి పదవులు ఆశించి అవి దక్కనివారు సైతం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నరాని, అటువంటివారిని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఓ కంట కనిపెట్టి ఉండాలని పార్టీ శ్రేణులు సూచిస్తున్నారు.
కోటంరెడ్డిలాంటివారు ఎందరో..
తన నియోజకవర్గానికి ఎటువంటి నిధులు కేటాయించడంలేదంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి మురుగుకాల్వ డ్రెయినేజీలో కూర్చుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉంది కదా అని ప్రతిపక్షాలపై దాడులకు దిగితే ఆ తర్వాత వారు మనకు బుద్ధిచెబుతారని, అందరినీ సామరస్యంగా కలుపుకుపోవాలంటూ కొద్దిరోజుల క్రితమే ఆయన వ్యాఖ్యానించారు.
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అయితే 'ఈనాడు' దినపత్రికను పొగుడుతూ, 'సాక్షి' దినపత్రికను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడమేకాదు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అన్యాపదేశంగా పొగిడారు.
స్వరం వినిపించని అసంతృప్తులు ఉన్నారు?
ముఖ్యమంత్రి జగన్ మీట నొక్కి మంచి పేరు తెచ్చుకుంటున్నారని, నిధులు లేక తాము మాత్రం ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుంటున్నామంటూ మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్గా మారాయి. మూడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నవారు వీరొక్కరే కాదని, వినిపించకుండా సైలెంట్ గా ఉన్నవారు కూడా ఎంతోమంది ఉన్నారంటున్నారు.
క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదు
నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయకపోవడంవల్ల ప్రజల్లో తమమీద వ్యతిరేకత వ్యక్తమవుతోందనేది ఎమ్మెల్యేలందరి అభిప్రాయంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయబోతున్నారు. అభివృద్ధి పనులు చేపట్టిన తర్వాత కూడా ధిక్కార స్వరాలు వినిపిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సహించలేది లేదని పార్టీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు హెచ్చరికలు జారీచేశారు.