అసెంబ్లీలో టీ తీర్మానాన్ని ఓడిస్తే మార్పు: లగడపాటి
సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని చెబుతూ ఆర్టీసి ఉద్యోగులు, ఎన్జీవోలు సమ్మె విరమించాలని ఆయన కోరారు. సమ్మె విరమించిన సీమాంధ్ర ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాము పెట్టిన ఒత్తిడి కారణంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ తీర్మానాన్ని శానససభకు పంపించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన చెప్పారు. స్పీకర్ మీరా కుమార్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన రాజీనామా ఆమోదానికి పట్టుబడుతానని లగడపాటి చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగ ప్రక్రియను, సంప్రదాయాలను పాటిస్తామని కేంద్ర మంత్రి చిదంబరం రాజ్యసభలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శానససభలో తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తే దేశం మొత్తానికి పరిస్థితి తెలిసే అవకాశఁ ఉంటుందని, మెజారిటీ సభ్యులు ఎటు వైపు ఉన్నారో తెలుస్తుందని ఆయన అన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం కోసం సీమాంధ్రలో పార్టీలన్నీ ఒకే వేదిక మీదికి రావాలని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. గాంధీ మార్గంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాగిస్తామని ఆయన గురువారం హైదరాబాదులో మీడియాతో అన్నారు. ఉద్యోగులు పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నారని, వారి ఉద్యమాన్ని బలపరుద్దామని ఆయన అన్నారు.