మరో ఉపరితల ఆవర్తనం- ఏపీకి ఓ మోస్తరుగా: అత్యధిక వర్షపాతం
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజుల కిందటే ఏపీలో భారీగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడ్డాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. కొంత విరామం తర్వాత మళ్లీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనమే దీనికి కారణం.
బంగాళాఖాతం వాయవ్య దిశగా తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర, ఏజెన్సీ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం సైతం లేకపోలేదు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీహోర్డింగ్స్ వద్ద ఉండరాదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 80.5 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా కే కోటపాడు- 68, గంధవరం- 61.5, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట- 55 మిల్లీ మీటర్ల చొప్పున అధిక వర్షపాతం నమోదైందన్నారు. అలాగే- ఈ నెల రెండోవారంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఈ అల్పపీడనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది.












Click it and Unblock the Notifications