ఏపీలోని ఈ జిల్లాలకు నేడు, రేపు భారీ వర్ష సూచన: అత్యధిక వర్షపాతం అక్కడే
AP Rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురిసింది.
42 నుంచి 47 డిగ్రీల ఎండతో విలవిల్లాడిన ఏపీ ప్రజలకు ఈ వర్షాలు ఊరట కలిగించాయి. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్లు పడ్డాయి. ఈ రెండు జిల్లాల్లో ఎండిపోయిన చెరువులు, కుంటలు ఇప్పుడిప్పుడే జలకళను సైతం సంతరంచుకుంటోన్నాయి.

ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. వచ్చే 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షలు కురిపే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ, ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థలు తెలియజేశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు, గుంటూరు, పల్నాడుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు, పల్నాడు, బాపట్ల, రాయలసీమలోని అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
శ్రీసత్యసాయి, కడప, ప్రకాశం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు.
మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలోని వేమగిరిలో అత్యధికంగా 124.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లాలోని మండపేట-120.5, రాజమండ్రి- 92, కోనసీమ జిల్లా తాటిపూడి- 75.5, ఏలూరు జిల్లా నూజివీడు- 73.5, కృష్ణా జిల్లా మచిలీపట్నం- 73 మిల్లీ మీటర్ల మేర అధికవర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications