ఏపీకి తీవ్ర వాయుగుండం- ఈ రాత్రికే
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ జిల్లాల వరకూ భారీ వర్షాలు దంచికొట్టాయి. ప్రత్యేకించి- రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల తీవ్రత మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. ఇది- తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఈ తెల్లవారు జామున 6 గంటల సమయానికి విశాఖపట్నానికి 300, ఒడిశాలోని గోపాల్పూర్- 310, పారాదీప్- 400 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 10 కిలో మీటర్ల వేగంతో ఇది తీరం వైపు కదులుతోంది. నేటి రాత్రికి గోపాల్పూర్- పారాదీప్ మధ్య ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాయుగుండం తీరానికి సమీపించినప్పుడు- ఆ తర్వాత 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం వరకు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంపైకిి వెళ్లకూడదని సూచించారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.
అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.












Click it and Unblock the Notifications