ఏపీకి భారీ వర్ష సూచనలు
Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ అంచనాలకు మించిన స్థాయిలో వర్షపాతం నమోదైంది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి.
ఇదే తరహా వాతావరణ పరిస్థితులు మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పలు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావొచ్చని విపత్తు నిర్వహణ విభాగం అంచనా వేసింది.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. బలమైన గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వచ్చే 24 గంటల్లో అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షపాతం నమోదవుతుంది.
అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు లేకపోలేదని ఎస్డీఎంఏ అభిప్రాయపడింది.
పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ విజ్ఞప్తి చేసింది. ఆ సమయంలో చెట్ల కింద తలదాచుకోకూడదు. వర్షం పడే సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందికి వెళ్లకూడదని పేర్కొంది.












Click it and Unblock the Notifications