ఏపీలో 11 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం
Heavy rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ద్రోణి పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి- గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అటు విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
ద్రోణి ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని చెప్పారు.

అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు చెట్ల క్రింద నిలబడరాదని, ఈదురుగాలుల వీచేప్పుడు హోర్డింగ్స్ దగ్గర ఉండకూడదని సూచించారు.
సెప్టెంబర్ 20 ఉదయం 8:30 గంటల నుండి ఈ తెల్లవారు జామున 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో సాధారణం కంటే 7.1 మిల్లీ మీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. విజయనగరం- 3.6, విశాఖపట్నం- 2.5, తూర్పు గోదావరి- 2.8 మిల్లీ మీటర్ల మేర అధిక వర్షపాతం రికార్డయింది. కృష్ణా- 14.1, ఎన్టీఆర్- 19.1, గుంటూరు- 14.8, బాపట్ల- 11.1, పల్నాడు- 14.8, ప్రకాశం- 13.4 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదూంది. ఇది సాధారణం కంటే అధికం.












Click it and Unblock the Notifications