భవిష్యత్తు అంధకారం చేసిన మోదీ..! 11 న ఢిల్లీ దీక్షను విజయవంతం చేయాలని బాబు పిలుపు..!!
అమరావతి : అందరి భవిష్యత్తు నరేంద్ర మోడీ అంధకారం చేశారని ముఖ్యమంత్ర చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాజ్యాంగ హక్కులపై దాడులు చేస్తున్నారని, 23పార్టీల మహా కల్తీ అనడం మోడీ దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు. నరేంద్ర మోడీది మాటల గారడి అయితే జగన్మోహన్ రెడ్డిది మోసాల గారడి అని చంద్రబాబు విమర్శించారు. బ్యాంకులను మోడీ నిర్వీర్యం చేశారని, ఏటీఎంలు మూత పడటం అంటే బ్యాంకులను బలోపేతం చేయడమా అని చంద్రబాబు ప్రశ్నించారు. వేల కోట్లు ఎగ్గొట్టి పరారు కావడం బ్యాంకులను బలోపేతం చేయడమా అని నిలదీశారు. దోపిడీ దారులను దేశం దాటించడం నీతివంతమైన పనులా అని అడిగారు. పార్లమెంట్ లో టిడిపి ఎంపిల స్ఫూర్తి అందరిలో రావాలని ఆకాంక్షించారు.
ఇక ఈనెల 11వ తేదీన ఢిల్లీలో తలపెట్టిన ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా ధర్మపోరాటం చేస్తున్నామని, ఈ పోరాటంతో కేంద్రం కదిలి విభజన హామీలు నెరవేర్చాలని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పోరాట దీక్షకు ప్రజలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపి రాష్ట్రం వైపు నిలబడ్డాయని., ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల వైపు నిలబడ్డాయని చంద్రబాబు ఆరోపించారు. ఎవరు రాష్ట్రం కోసం కలిసొస్తారో, ఎవరు రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడతారో 11వ తేదీ ఢిల్లీలో జరిగే ఆందోళనతో తేటతెల్లం అవుతుందని చంద్రబాబు తెలిపారు. 11న ఢిల్లీ దీక్షకు ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలని వారు రాకపోతే ఎవరిది ప్రజా పక్షమో ప్రజలే నిర్ణయిస్తారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.