మోడీకి అవిశ్వాసం చిక్కులు: ఆ పార్టీల బలాలు ఇవీ, ఏమవుతుంది?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం తస్సుమనే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించే అవిశ్వాసానికి సరిపడా మద్దతు ఇప్పటికే లభించినట్లు కనిపిస్తోంది.
Recommended Video
వైసిపి, టిడిపిలు ప్రతిపాదించిన అవిశ్వాసాలు ఒకే అంశంపై అయితే, వాటిని కలిపి చర్చకు తీసుకునే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడానికి మీనమేషాలు లెక్కించిన పార్టీలు కూడా చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలుస్తున్నాయి.
టిడిపి అవిశ్వాసం చర్చకు రావడానికి 54 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. టిడిపి అవిశ్వాసానికి మద్దతు ప్రకటించిన పార్టీల బలాలు ఆ సంఖ్యను మించి ఉన్నాయి. కాంగ్రెసుతో సహా పలు పార్టీలు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.
లోకసభలో మోడీ బలం ఇంత...
అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏమీ ఉండకపోవచ్చు. బిజెపికి లోకసభలో 273 మంది సభ్యులు ఉన్నారు. ఓటింగ్ జరిగితే తీర్మానం వీగిపోయే పరిస్థితే ఎక్కువగా ఉంది. అవసరమైతే చివరలో చిన్నాచితక పార్టీలను తనకు మద్దతుగా బిజెపి కూడగట్టుకోవచ్చు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం చేసిందని భావిస్తున్న అన్యాయం మాత్రం చర్చకు వస్తుంది.
కాంగ్రెసు, టిఎంసీ బలాలు ఇవీ...
టిడిపి అవిశ్వాసానికి మద్దతు ప్రకటించిన తృణమూల్ కాంగ్రెసుకు లోకసభలో 34 మంది సభ్యులున్నారు. కాంగ్రెసు పార్టీకి 48 మంది సభ్యులు ఉన్నారు. ఈ రెండు పార్టీల బలం అవిశ్వాసం చర్చకు రావడానికి సరిపోతుంది. అవిశ్వాసంపై వైసిపి సరిగా కసరత్తు చేయలేదని భావించిన కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
కేసీఆర్, ఓవైసీ సైతం...
వైసిపి ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలా, వద్దా అని సందిగ్ధంలో పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) టిడిపి అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడానికి ఏమాత్రం సమయం తీసుకోలేదు. టిఆర్ఎస్కు లోకసభలో 11 మంది సభ్యులున్నారు. అలాగే మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉంది.
విచిత్రంగా అన్నాడియంకె మద్దతు
టిడిపి ప్రతిపాదించిన అవిశ్వాసానికి అనూహ్యంగా అన్నాడియంకె మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి లోకసభలో 37 మంది సభ్యులున్నారు. ప్రధాని మోడీ కనుసన్నల్లో పనిచేస్తోంనదే విమర్శలు ఎదుర్కుంటున్న ఆ పార్టీ టిడిపి అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడం ఆశ్చర్యకమైన విషయమే. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి చేస్తున్న రాజకీయాన్ని చంద్రబాబు ప్రస్తావించడం వల్ల, దాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు అన్నాడియంకె మద్దతు ఇస్తుండవచ్చునని భావిస్తున్నారు.
టిడిపి మద్దతు ఇస్తున్న పార్టీల బలాలు
టిడిపి ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్న పార్టీల బలాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెసు 48, తృణమూల్ కాంగ్రెసు 34, టిఆర్ఎస్ 11, సిపిఎం 9, శివసేన 18, అన్నాడియంకె 27 ఉండగా సిపిఐకి 1 సభ్యుడున్నారు, టిడిపి సభ్యుల సంఖ్య 16 ఉంది. ఈ లెక్కన టిడిపికి బలమైన పార్టీలు అండగా నిలిచినట్లు భావించవచ్చు.
లోకసభలో పార్టీల బలాబలాలు
బిజెపి 273 (స్పీకర్తో కలిపి), కాంగ్రెసు 48, అన్నాడియంకె 37, తృణమూల్ కాంగ్రెసు 34, బిజూ జనతా దళ్ 20, శివసేన 18, తెలుగుదేశం 16, తెలంగాణ రాష్ట్ర సమితి 11, సిపిఎం 9, వైఎస్సార్ కాంగ్రెసు 9, ఎస్పీ 7, లోకజనశక్తి పార్టీ 6, నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ 6, ఆప్ 4, శిరోమణి అకాలీదళ్ 4, ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 3, ఇండిపెండెంట్స్ 3, ఆర్జెడీ 3, రాష్ట్రీయ లోకసమతా పార్టీ 3, అప్నా దళ్ 2, ఇండియన్ నేషనల్ లోకదళ్ 2, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ 2, జనతాదళ్ (సెక్యులర్) 2, జనతాదళ్ యునైటెడ్ 2, జెఎంఎం 2, మజ్లీస్ 1, ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెసు 1, సిపిఐ 1, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 1, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ 1, కేరళ కాంగ్రెసు (ఎం) 1, నేషనల్ పీపుల్స్ పార్టీ 1, పిఎంకె 1 రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ 1, సిక్కిం డెమొక్రటిక్ పార్టీ 1, స్వాభిమాని పక్ష 1, జన అధికార్ పార్టీ (లోక్ తాంత్రిక్) 1. నామినెటెడ్ ఎంపీలు 2