గాయత్రి మూవీలో మోహన్ బాబు పంచ్లు: చంద్రబాబు మీదనేనా?
హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గాయత్రి సినిమా ద్వారా మరోసారి తన మార్కును చూపెట్టారు. గాయత్రి సినిమాలో ఆయన కొన్ని పొలిటికల్ పంచ్లు వేశారు. ఆ పొలిటికల్ పంచ్లు ఎవరి మీద అనే చర్చ సాగుతోంది.
వచ్చే ఎన్నికల నాటికి ఆయన రాజకీయ ప్రవేశం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. తాను రాజకీయాల్లోకి తిరిగి వస్తానని అప్పట్లో రెండు మూడు సార్లు చెప్పారు. కానీ ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.

గాయత్రి మూవీలో ఇలా
నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నాకు ఓటేయకపోతే ఆ రోడ్ల మీద నడవద్దు అనే డైలాగ్ ఉంది. అది చెప్పినా చెప్పకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి పెట్టిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో ఓసారి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే అవి.

ఇక నారా లోకేష్పై ఇలా..
నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో సార్వభౌమాధికారం అనే పదాన్ని పలకడంలో పడిన ఇబ్బందిని కూడా గాయత్రి సినిమాలో డైలాగుగా ఉంది. సార్వభౌమాధికారం పలకడం రాదు గానీ క్యాబినెట్ మినిస్టర్ అవుతారనేది ఇది. ఇది స్పష్టంగా నారా లోకేష్ను ఉద్దేశించిందేనని అంటున్నారు.

ఇక జలీల్ ఖాన్పై ఇలా...
బీకాంలో ఫిజిక్స్ చదివిన ఎమ్మెల్యే అనే ప్రస్తావన కూడా ఉంది. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన జలీల్ ఖాన్ను ఉద్దేశించింది చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. అప్పట్లో జలీల్ ఖాన్ చెప్పిన ఆ మాట వివాదానికి, చర్చకు దారి తీసింది. క్యాబినెట్ మినిస్టర్కు రాష్ట్ర పక్షి ఎవరో తెలియదనే ప్రస్తావన కూడా ఉంది.

గతంలో మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా...
గతంలో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మోహన్ బాబు ఎటు వైపు...
మోహన్ బాబు వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలో చేరుతారనేది సస్పెన్స్గానే ఉంటూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన సన్నిహితుడు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని కాకముందు హైదరాబాదులో పర్యటనలో నరేంద్ర మోడీని కలిశారు. ఆయన బిజెపిలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

వైఎస్ జగన్ సన్నిహిత బంధువు...
మోహన్ బాబు కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బంధువు అవుతారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఆయనతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications