ప్రధాని నరేంద్ర మోడీని అందుకే కలిశా: ఆయనకు అలాంటి భేదాభిప్రాయాలు లేవు: మోహన్ బాబు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం ప్రముఖ తెలుగు సినీనటుడు మోహన్ బాబు తన కుటుంబసభ్యులతో కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కూడా వారు కలిశారు. అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.
పార్టీలోకి ఆహ్వానించారా? అంటే..
తిరుపతిలోని తమ విద్యాసంస్థలను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు మోహన్ బాబు తెలిపారు. అయితే, బీజేపీలోకి రావాలని మోడీ ఆహ్వానించారా? అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు మోహన్ బాబు సమాధానం దాటవేశారు.
ప్రధానికి అలాంటి భేదాభిప్రాయాలు లేవు..
ఇటీవల కేవలం బాలీవుడ్ నటులతోనే నరేంద్ర మోడీ భేటీ అయ్యారు కదా.. అని ప్రశ్నించగా.. ప్రధానికి అలాంటి భేదాభిప్రాయాలు లేవని మోహన్ బాబు తెలిపారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘మీరు(ప్రధాని) బాలీవుడ్ నటులను కలిశారు.. దక్షిణాది నుంచి ఎవర్నీ కలవలేదు. ఈ విషయంలో కొంతమంది అలిగారు. మరికొంత మంది బాధపడ్డారు' అని ప్రధానితో చెప్పినట్లు తెలిపారు.
త్వరలోనే దక్షిణాదితో తారలతో..
తనకు అవకాశం వచ్చింది కాబట్టేవారితో కలిశానని ప్రధాని మోడీ చెప్పారని విష్ణు తెలిపారు. త్వరలో దక్షిణాది నటులతోనూ కలుస్తానని ప్రధాని అన్నారని తెలిపారు. ప్రధాని మోడీకి ఉత్తరాది, దక్షిణాది భేదాలేమీ లేవని విష్ణు అన్నారు. తాము ప్రధానిని రిక్వెస్ట్ చేశామని.. త్వరలో దక్షిణాది సినీనటులం కలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
బీజేపీలోకి మోహన్ బాబు?
ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, కొడుకు విష్ణు, ఆయన సతీమణి వెరోనికా రెడ్డి కలిశారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీతో మోహన్ బాబు కొంత సమయం చర్చలు జరిపారు. అయితే, మోహన్ బాబు బీజేపీలో చేరేందుకే మోడీని కలిశారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనుచరులకు కూడా ఈ మేరకు సమాచారం ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మోహన్ బాబు మాత్రం బీజేపీలో చేరికపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. గతంలో కూడా ప్రధాని మోడీని మోహన్ బాబు పలుమార్లు కలిశారు. అయితే, ఇప్పుడు అనుకోకుండా ఇలా కలవడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీసింది.