చంద్రబాబు సీరియస్: సిగ్గుమాలిన పనిచేసి లొంగిపోయిన ఎంఈఓ
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన మండల విద్యా శాఖాధికారి (ఎంఈ ఓ) కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో నిందితుడైన ఎంఈ ఓ గంగప్ప శుక్రవారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
హిందూపురం: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన మండల విద్యా శాఖాధికారి (ఎంఈ ఓ) కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో నిందితుడైన ఎంఈ ఓ గంగప్ప శుక్రవారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఇటీవల మిట్టమీదపల్లికి చెందిన బాలికపై అత్యాచారానికి యత్నించాడంటూ ఆమె తల్లిదండ్రులు రెండ్రోజుల క్రితం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు, ఎంఈఓ గంగప్పపై నిర్భయ చట్టం కేసు నమోదు చేసినట్లు సీఐ రాజ గోపాల్నాయుడు తెలిపారు.
కాగా, అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన ఈ విషయం సీఎం కార్యాలయానికి చేరింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అవడంతో ఎంఈఓను వెంటనే సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఎంఈఓను పట్టుకునేందుకు గురువారం సాయంత్రం ఐదు బృందాలు రంగంలోకి దిగాయి.
సమాచారం తెలుసుకున్న ఎంఈఓ ఎలాగైనా తనను అరెస్టు చేస్తారని భావించి, శుక్రవారం రాత్రి హిందూపురం రూరల్ సీఐ రాజగోపాల్నాయుడు ఎదుట లొంగిపోయాడు. అతడిని వెంటనే జడ్జి ముందు హాజరు పరచడానికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎంఈఓ గంగప్ప మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నానని, తనపై ఎలాంటి ఆరోపణలూ లేవని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తాను వారింటికెళ్లి ఆ అమ్మాయిపై ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదన్నారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారన్న భయంతోనే తన ఫోన్ను బసవనపల్లి వద్ద ముళ్ల పొదల్లో పారేసి వెళ్లినట్లు తెలిపారు.