నైరుతి రుతుపవనాల ఎంట్రీ: ఏపీలో రానున్న మూడురోజులపాటు వర్షాలు
అమరావతి: ఇటీవల అసని తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అనేకచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు ఇళ్లు కూలిపోయాయి. రైతులు పండించిన పంట నీటిపాలైంది. ఈ నష్టంతోనే ప్రజలు, రైతులు ఆవేదనకు గురవుతుండగా.. తాజాగా, మరో మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాల ఎంట్రీ
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా బీహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి సోమవారం ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు, విదర్భ మధ్య కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో ఉంది. తీర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ఫలితంగానే ఏపీలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఉత్తరకోస్తాలో సోమవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. కాగా, దక్షిణకోస్తా ప్రాంతంలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమలోనూ మూడు రోజులపాటు వర్షాలు
మరోవైపు, రాయలసీమ ప్రాంతంలోనూ సోమవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లలులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.