బాబు కరెక్టే, 2020 కాకూడదు: ఎపి రాజధానిపై జెసి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఎక్కువ భూమిని సేకరించాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనను తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సమర్థించారు. రాజధాని కోసం ఎక్కువ భూమి అవసరమేనని ఆయన అన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు కావాలంటే ఎక్కువ భూమి అవసరమేనని ఆయన అన్నారు. విశాలమైన పార్కులు, రోడ్లు, ఇతరాల కోసం భూములు సేకరించాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు 2020ను మాత్రమే దృష్టిలో పెట్టుకూకడదని ఆయన అన్నారు. 2075నో, 3000లనో దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని చంద్రబాబు కూడా ఊహించలేకపోయారని ఆయన అన్నారు. విభజన తర్వాత జరుగుతాయని అనుకున్న పంపకాల విషయంలో చంద్రబాబు లెక్క తప్పిందని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, అదే సమయంలో రాజధానికి అన్ని హంగులూ ఉండాలని జెసి అన్నారు.
పంట రుణాల మాఫీ జరుగుతుందని, అయితే సమయం పడుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇస్తున్నారని, ఇక్కడ తనకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున అనంతపురం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications