ఉమ్మడి ఎపి: అక్రమ సంబంధాల వల్లే అధిక హత్యలు
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా హత్యలు అక్రమ సంబంధాల వల్లే జరిగాయి. గత ఏడాది కాలంగా ప్రతి రోజూ ఒక హత్య అక్రమ సంబంధాల కారణంగా జరిగినట్లు వెల్లడైంది. ఈ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.
ఎన్సిఆర్బి లెక్కల ప్రకారం - నిరుడు 2013లో ఆ విధమైన హత్యలు 385 జరిగాయి. వీటిలో 15 శాతం మోసం చేసిన భాగస్వామి, లైంగిక భాగస్వామి, ప్రేమికుల తల్లిదండ్రులు హత్యకు గురయ్యారు. నిరుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,484 హత్య కేసులు నమోదయ్యాయి.
వైవాహికేతర సంబంధం వల్ల, ప్రేమికులు మోసం చేయడం వల్ల, ప్రేమికులు నిరాకరించడం వల్ల ఎక్కువ హత్యలు జరిగాయి. వీటితో పోలిస్తే రాజకీయ, ఆర్థిక, ఆస్తి తగాదాల వల్ల జరిగిన హత్యలు తక్కువ. మోసం భార్య లేదా భర్త లేదా లవర్ హత్యకు గురి కావడం ఎక్కువ సందర్భాల్లో చోటు చేసుకుంది.
లైంగిక కారణాల వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల జరిగిన హత్యల విషయంలో తమిళనాడు రెండవ స్థానం ఆక్రమిస్తోంది. ఇటువంటి హత్యలు తమిళనాడులో 316 నమోదయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దోపిడీ దొంగల చేతుల్లో 240 మంది హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాల వల్ల 152 మంది హత్యలకు గురయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల 230 హత్యకు గురయ్యారు.