భర్త మద్యం మత్తులో: ఇద్దరు పిల్లలను చంపేసి ఉరేసుకున్న తల్లి
అమరావతి: అప్పుల బాధలు, కుటుంబ కలహాలు ఆ ఇల్లాలిని తీవ్ర మానసిక సంఘర్షణకు గురిచేశాయి. అవమానాలు పడాలేమే అన్న బాధ ఆమెను మరింతగా కుంగదీసింది. భర్త మద్యం మత్తులో గాఢనిద్రలో ఉండగా అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం కొట్టాలపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో నివసిస్తున్న ఆనందరెడ్డికి నెల్లూరుకు చెందిన భారతి(28)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మహాలక్ష్మి(4), ఐదు నెలల బాబు ఉన్నారు.
ఆనందరెడ్డి అద్దెకు ఆటో తీసుకొని నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాగే కొంత భూమిని కౌలుకు తీసుకుని మిరప పంట సాగు చేశాడు. పెట్టుబడి కోసం కొంత అప్పు చేశాడు. మిరప పంట పూర్తిగా దెబ్బతినడంతో రూ.3 లక్షల వరకు నష్టం వచ్చింది.
కాగా, ఆటో తోలగా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకే చాలడం లేదు. దీంతో మరింత అప్పు చేశాడు. ఈ క్రమంలోనే తాగుడుకు అలవాటు పడ్డాడు. అప్పు రూ.5 లక్షలకు చేరింది. దీంతో అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మేశాడు. అయినా అప్పు తీరలేదు. ఈ నేపథ్యంలో ఆ దంపతుల మధ్య మనస్ఫర్థలు వచ్చాయి.
ఇల్లు అమ్మేయడంతో నిలువు నీడ లేకపోవడం, మరో 5 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని కొనుగోలుదారులు చెప్పడంతో భారతి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ ఆదివారం రాత్రి గొడవపడ్డారు. స్థానికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.
సోమవారం ఉదయం ఆనంద్ రెడ్డి నిద్ర లేచి చూసేసరికి భార్య ఉరేసుకుని, ఇద్దరు పిల్లలు మహాలక్ష్మి(4), ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు విగతజీవులుగా కనిపించారు. ఈ మేరకు అతడు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.