ఇంత దౌర్భాగ్యమా: టిడిపిపై మోత్కుపల్లి ఫైర్, అసెంబ్లీకి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సొంత పార్టీ నేతల పైన బుధవారం నిప్పులు చెరిగారు. ఆయన ఉదయం అసెంబ్లీకి వచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, సభాపతి నాదెండ్ల మనోహర్ను కలిసేందుకు ప్రయత్నాలు చేశారు.
ఆయన ప్రయత్నాలను టిడిపి నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. తెలంగాణ టిడిపి నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. దీనిపై మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు సీట్లు ఆంధ్రావాళ్లకే ఇచ్చినా మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉందని మండిపడ్డారు. ఆ సమయంలో కొందరు టిడిపి నేతలు ఆయన వద్దకు వచ్చి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. దానికి మోత్కుపల్లి ససేమీరా అన్నారు. బాబును కలిసేందుకు నిరాకరించారు.
స్పీకర్ను కలిసిన తెలంగాణ మంత్రులు
మరోవైపు తెలంగాణ ప్రాంత మంత్రులు సభాపతి నాదెండ్ల మనోహర్ను కలిసి తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఓటింగ్, తీర్మానం చేపట్టరాదని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు ఉదయం శాసన సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. విపక్షాలు ఇచ్చిన తీర్మానాలను సభాపతి తిరస్కరించారు. ఓటింగ్ కోసం సీమాంధ్ర సభ్యులు, సిఎం నోటీసు తిరస్కరించాలని తెలంగాణ నేతలు పట్టుబట్టడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో సభాపతి సభను గంటపాటు వాయిదా వేశారు.