కేసీఆర్ను ఏకేసిన మోత్కుపల్లి, దీక్ష: 29దాకా అసెంబ్లీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనకు రాజకీయ భిక్ష పెట్టిన స్వర్గీయ నందమూరి తారక రామారావునే అవమానించడం సిగ్గుచేటు అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం అన్నారు. కేసీఆర్ మొదట తన కొడుకు పేరు మార్చుకోవాలన్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తెలంగాణ శాసనసభ వ్యతిరేకించడాన్ని మోత్కుపల్లి ఖండించారు. ఎన్టీఆర్ను అవమానపరుస్తూ శాసనసభలో మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఇందుకు నిరసనగా రేపు ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేస్తానన్నారు.
రాజీవ్ గాంధీ పేరు తీయమని ఎందుకు అడగరు: అచ్చెన్నాయుడు
శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు తొలగించాలని అడిగే హక్కు కేసీఆర్కు ఎక్కడిదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు ఇష్టం లేకపోతే ముందు ఆయన తన కొడుకుకి ఆ పేరు తొలగించాలన్నారు. రాజకీయ భిక్ష పెట్టిందెవరో మరిచిపోతే ఎలా అన్నారు.
రాజీవ్ గాంధీ తెలంగాణ వ్యక్తియా లేక తెలుగు వాడా చెప్పాలన్నారు. ఆయన పేరును తొలగించాలని ఎందుకు అడగరన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు అందరు ఎన్టీఆర్ను అభిమానిస్తారన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో అలాంటి వ్యక్తి పేరు తొలగించడం సరికాదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు
తెలంగాణ శాసన సభ సమావేశాలను ఈ నెల 29వ తేదీ వరకు పొడిగించారు. సోమవారం నుండి రెండు పూటలా సమావేశాలు ఉంటాయి. 29వ తారీకు మాత్రం ఒక పూటనే ఉంటుంది. ఆ రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తారు. ద్రవ్య వినిమయ బిల్లు పైనే చర్చ ఉంటుంది. మధ్యాహ్నానికి దానికి ఆమోద ముద్ర వేస్తారు. 29న సాయంత్రం కేసీఆర్ మండలికి వెళ్తారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బీఏసీసీ టీడీపీ హాజరు కాలేదు.
సభ నిర్వహణపై అక్బర్ అభ్యంతరం
సభ నిర్వహణ తీరు పైన మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ షెడ్యూల్ నిర్వహణ శనివారం వరకే ఉందని, సోమవారం వరకు ఎలా పొడిగిస్తారని, బీఏసీ నిర్ణయాలను గౌరవించకుండా ముందుకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దీనిపై హరీష్ రావు ఆయనకు నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది.