కెసిఆర్ తుపాకి రాముడు: మోత్కుపల్లి, బ్లాక్: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఫాంహౌస్ వ్యవసాయంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ది తుపాకి రాముడి కాలక్షేపమని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. కోట్లు సంపాదించుకుని కెసిఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
వ్యవసాయంలో కోట్లు వస్తుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని ఆయన అడిగారు. రైతులు అప్పుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారా, వ్యవసాయం చేయలేకనా అనేది కెసిఆర్ చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణపై అంతా గగ్గోలు పెడుతుంటే కెసిఆర్ ఫాంహౌస్లో వ్యవసాయం పేర కాలక్షేపం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని కెసిఆర్ సంపాదించారని ఆయన అన్నారు. మంది కొంపలు ముంచితే కెసిఆర్ లాంటి వ్యవసాయం ఎంతైనా చేయవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.
వ్యవసాయాన్ని అడ్డుపెట్టుకుని వసూళ్ల సొమ్మును వైట్ మనీగా మారుస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు కెసిఆర్పై ధ్వజమెత్తారు. కేసీఆర్కు విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్లు ఫ్రీగా వస్తున్నాయని, బ్లాక్ మెయిల్ చేసి పంటను ఎక్కువ ధరకు కొనిపిస్తున్నారని ఆరోపించారు. తాను రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే రూ.5 లక్షలు కూడా రాలేదని, వ్యవసాయం లాభసాటిగా లేదని ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు అవకాశం లేకుండా చేయడం దురదృష్టకరమని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. ఏదో విధంగా కాలయాపన చేసి బిల్లును ఆపాలనే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. చీకటి ఒప్పందాలకు తెలంగాణ ప్రజలను బలిచేయవద్దని ఆయన కెసిఆర్ను కోరారు. వేయి మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే కెసిఆర్ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
మోత్కుపల్లికి పిచ్చి కుక్క కరిచినట్లుంది.
కాగా, కెసిఆర్పై తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను తెరాస శాసనసభ్యులు ఖండించారు. తెలుగుదేశం పార్టీ నేతలవి చౌకబారు ఆరోపణలని తెరాస శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ అన్నారు. కెసిఆరే లక్ష్యంగా మోత్కుపల్లి మాటలు చూస్తే పిచ్చికుక్క కరిచినట్లుగా అనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర కోసం పనిచేస్తున్న చంద్రబాబుకు ఏజెంటుగా మోత్కుపల్లి పని చేస్తున్నారని ఆయన అన్నారు.