'ఓపిక నశిస్తోంది': ఏపీకి హోదా రాదన్న విషయం ఎంపీలకు ముందే తెలుసా?
న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీల మాటలు చెబుతున్న మాటలు వింటుంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా రాదనే విషయం స్పష్టమవతుంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మంగళవారం పార్లమెంట్ ఆవరణలో మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం వేచివేచి ఓపిక నశిస్తోందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్కు ఏం చేయాలో ఆలోచిస్తున్నామని ఉభయసభల్లో ఆర్ధిక మంత్రి చెప్పారని అన్నారు. ఏపీకి హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. అయితే ఏపీకి కోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఏపీకి హోదాకోసం వైసీపీ అధినేత జగన్ సహా ఏ పార్టీ ప్రయత్నించినా దానిని స్వాగతిస్తామని ఎంపీ తెలిపారు. మరో టీడీపీ ఎంపీ రవీంద్రబాబు మాట్లాడుతూ మా ఆలోచన, నిద్ర, ఆహారం, సంతోషం, బాధ అన్నీ ఏపీకి ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉన్నాయని అన్నారు.
జీఎస్టీ సవరణ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో మంగళవారం పాల్గొన్న ఆయన ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. హోదా హామీ నెరవేరకుండా జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చల్లో పాల్గొంటే ప్రజల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
ఏపీకి హోదా విషయమై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయమై వీలైనంత త్వరగా ప్రకటన చేయాలని ఆయన కోరారు. 'ఒక దేశం- ఒక పన్ను విధానం తీసుకొచ్చినందుకు ప్రధాని, ఆర్థిక మంత్రి, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలందరికీ అభినందనలు. భారత్ ఎప్పుడూ ఒకటే అని నిరూపించారు' అని అన్నారు.
అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 'నేను పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి వచ్చాక ప్రత్యేకహోదా అంశంపై పార్లమెంట్లో మొదటిసారి మాట్లాడే అవకాశం వచ్చింది. మాకు ప్రత్యేక హోదా కావాలి. జీఎస్టీ బిల్లుకు మేము మద్దతు ఇచ్చాం. మీరూ, మేము అడిగింది ఇవ్వండి' అని అన్నారు.
'హోదా అనేది చాలా భావోద్వేగంతో కూడిన అంశం. జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాత మా నియోజకవర్గానికి వెళితే ప్రత్యేకహోదా ఇవ్వకుండా మీరెందుకు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారన్న ప్రశ్నలు ఎదురవుతాయి. హోదాపై ఈ వారంలో మీ నుంచి సమాధానం ఆశిస్తున్నాం. ఇప్పటికే హామీ ఇచ్చారు. జీఎస్టీ అమల్లోకి వస్తే ఏపీ రూ.6800 కోట్లు నష్టపోతుంది' అని తెలిపారు.