నేనెవరినీ పొగడను...జగన్ తాత కంటే పెద్ద రెడ్డిని అని చెప్పా:ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
అనంతపురం:కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబును వ్యతిరేకించానని, ఆయనపై అప్పట్లో విమర్శలు కూడా చేశానని...అయితే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన తరువాత జగన్ కంటే చంద్రబాబే మేలనిపించి టీడీపీలోకి వెళ్లానని అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.
గొడ్డుమర్రి ఊట కాలువ తూముకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యామినీబాలతో కలిసి ఎంపి జెసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బాగుపడాలని తపన పడే వ్యక్తి చంద్రబాబునాయుడు అన్నారు. జగన్ ఒక లెక్క మనిషి అని, కడప భాషలో లెక్క లెక్క అంటూ నేటికీ పరితపించిపోతున్నారన్నారు. తన వద్దకు విజయసాయిరెడ్డిని పంపి రూ.30 కోట్లు అడిగించారని...ఆ మాట వినగానే..."మీ నాన్న, మీ తాత కంటే నేను కూడా పెద్ద రెడ్డినే" అని చెప్పానన్నారు.
తాను ఎవరినీ పొగడనని, అలా పొగిడి పదవులు పొందాలనే ఆశ కూడా తనకు లేదని ఎంపీ జేసీ దివాకర్రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా తాను పనిచేశానని, తనలాంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరూ లేరని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు మనం గాంధీని చూడలేకపోయినా, ప్రతి ఒక్కరికీ గాంధీ అంటే తెలుసునన్నారు. చంద్రబాబు కూడా ప్రజలకు మేలు చేసే వ్యక్తిత్వమున్న వ్యక్తి అని, మంచి పనులు చేస్తే చనిపోయిన తరువాత కూడా పది కాలాలు గుర్తుంచుకుంటారనే తపన కలిగి మంచి పనులు చేస్తున్నారన్నారు.
కోనసీమకు నీరందిస్తే.. అక్కడ వరిమడులు మాత్రమే పండుతాయని, రాయలసీమకు నీరందిస్తే ఇక్కడ చీనీ, అరటి, దానిమ్మ వంటి పండ్లతోటల ద్వారా రైతులకు సంవత్సరానికి లక్షలాది రూపాయల ఆదాయం వస్తుందని భావించి...ఎక్కడో ఉన్న నీటిని ఇక్కడికి మళ్లించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రైతుల కోసం డ్రిప్, ట్రాక్టర్లు సబ్సిడీపై అందిస్తున్నారన్నారు. గొడ్డుమర్రి ఆనకట్టలో భాగమైన ఊటకాలువను రెండు నెలల్లో పూర్తిచేయించి సెప్టెంబర్ చివరినాటికి కాలువకు నీరందిస్తామని ఎంపీ జేసీ దివాకర్రెడ్డి రైతులకు హామీఇచ్చారు.